మిధున్ రెడ్డి సమర్ధతకు పరీక్షగా - ఆ మాజీ మంత్రి ఎంట్రీతో : స్కెచ్ మారిందా...!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. పార్టీల్లోని అంతర్గత రాజకీయాలపైన ప్రత్యర్ధి పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా అధికార పార్టీలో ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారిని తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏపీలో అధికారానికి కీలకమైన జిల్లా. ఈ జిల్లాలో 2019లో టీడీపీ నాలుగు స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు జిల్లాలో ప్రతిపక్షం కంటే..సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి.
సొంత పార్టీ నేతలతోనే సమస్యలు
జగ్గంపేట ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల పైన చర్చ మరకవముందే.. ఇప్పుడు తాజాగా పెద్దాపురంలో పార్టీ నేతల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏకంగా పార్టీ కీలక నేత..జిల్లా సమన్వయకర్త ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. తాజాగా పెద్దాపురం నియోజకవర్గ సమన్వయకర్త దవులూరి వీరబాబు...ఆయన వ్యతిరేక వర్గాల మధ్య స్థానికంగా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు అవి తారా స్థాయికి చేరుకున్నాయి.
దీంతో..అక్కడకు జిల్లా నేతలతో కలిసి ఎంపీ మిథున్ రెడ్డి రాజీ సమావేశం ఏర్పాటు చేసారు. దీనికి గోప్యంగా ఉంచారు. దొరబాబుతో పాటుగా ప్రత్యర్ధి వర్గాన్ని ఆహ్వానించారు. ఈ సమావేశం సమయంలోనూ రెండు వర్గాల మద్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..మిథున్ రెడ్డి రెండు వర్గాలకు షాక్ ఇచ్చేలా కొత్త స్కెచ్ వేసారు.
పార్టీ నేతలతో మిథున్ రెడ్డి మంతనాలు
2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి తోట నరసింహంతో భేటీ అయ్యారు. ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా.. టీడీపీలో చేరిన తరువాత ఆ పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా పని చేసారు. ఆయన సతీమణి పెద్దాపురం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి తోట నరసింహం ఫ్యామిలీ రాజకీయంగా దూరం పాటిస్తున్నారు.
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య కుదరని సమన్వయం.. పెరుగుతున్న వర్గ పోరాటాలతో జిల్లా పైన మిథున్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇప్పుడు పెద్దాపురం కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాల తో మిథున్ నేరుగా తోట నరసింహం తో సమావేశం కావటం ద్వారా ..ఇప్పుడు తిరిగి ఆయన జిల్లా రాజకీయాల్లో కీలకం అవుతారనే చర్చ మొదలైంది.
మాట వినకుంటే..కొత్త స్కెచ్ సిద్దం
కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచి జిల్లా రాజకీయాల పైన తోట కు పట్టు ఉంది. దీంతో..త్వరలో తోట నరసింహంతో సీఎం వద్ద సమావేశం ఏర్పాటు చేయాలని మిథున్ రెడ్డి నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అటు..ఇదే జిల్లాలో టీడీపీ..జనసేన వైసీపీలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో..జిల్లాలోనే మకాం వేసిన మిథున్ రెడ్డి...ఇప్పుడు పార్టీలో అసమ్మతులు..వర్గాలను కంట్రోల్ చేయటం ఆయన సమర్ధతకు సవాల్ గా మారుతోంది. త్వరలోనే నియోజకవర్గాల సమీక్షలో భాగంగా తూర్పు గోదావరి పైన సీఎం వరుస సమావేశాలు నిర్వహిస్తారని చెబుతున్నారు.