మిథున్ రెడ్డిని బరిలో దింపిన జగన్- బిగ్ స్టెప్..!!
మద్యం కేసు నుంచి బెయిల్ పై విడుదల అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. త్వరలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో ఆయన వచ్చే రెండు మూడు రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేయనున్నారు.
మద్యం కేసులో అరెస్ట్ అయిన తర్వాత అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకు అప్పగించిన విషయం తెలిసిందే. మిథున్ రెడ్డి అందుబాటులో లేనప్పుడు వీరిద్దరూ ఈ మూడు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గాల ఇన్ ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ వచ్చారు.

తాజాగా బెయిల్ పై మిథున్ రెడ్డి విడుదల కావడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ఆయనను రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఇదివరకే ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది కూడా. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి ఇక పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. త్వరలో అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మూడు జిల్లాలకు చెందిన అధ్యక్షులు, అసెంబ్లీ/లోక్ సభ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలతో సమావేశం కానున్నారు. త్వరలో ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా కార్యకర్తలను కూడా కలిసే అవకాశాలు లేకపోలేదు.
మద్యం కేసు అక్రమం అనే విషయాన్ని గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేయడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తోన్నారని, దీని ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తోన్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరికి వివరంగా తెలియజేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారని సమాచారం. ఈ కేసును అడ్డుగా పెట్టుకుని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి దుష్ప్రచారాన్ని సాగిస్తోందనే విషయాన్ని ప్రజలకు వివరంగా తెలియజేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications