జగన్ సెక్యూరిటీ వైఫల్యంపై కేంద్రం ఆరా?
Peddireddy Mithun Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో కనిపించిన లోపాలను ఆ పార్టీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైన తీరును ఎండగడుతోంది.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ జగన్కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు రక్షణ కల్పించడంలో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు.

గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లినప్పుడు జగన్కు పోలీసులు రక్షణ కల్పించలేదని, ఆ పర్యటనలో తీవ్ర భద్రత వైఫల్యం తలెత్తిందని మిథున్ రెడ్డి వివరించారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న జగన్కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే- వైఎస్ జగన్ నివాసం వద్ద సంభవించిన కొన్ని అవాంఛనీయ ఘటనలనూ మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీన్నీ కూడా కుట్రలో భాగమేనని ఆరోపించారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ఇక్కడి భద్రత వైఫల్యాలు ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ విధానాల వల్ల జగన్ ప్రాణాలకు ముప్పు పొంచివుందని చెప్పారు.

ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేంతటి ప్రమాదకర ధోరణికి చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం తెర తీస్తోందని విమర్శించారు. ఈ భద్రత వైఫల్యంపై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నాయకులు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ను సైతం కలిశారు. ఈ పరిణామాలపై కేంద్రం ఆరా తీస్తోన్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications