వైసీపీ ఫిర్యాదుకు రఘురామ కౌంటర్- ప్రివిలేజ్ మోషన్తో- అనర్హత చెల్లదని ధీమా
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు కోరుతూ రెండోసారి సొంత పార్టీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు తాజాగా ఫిర్యాదు చేసారు. దీనిపై రఘురామ ఘాటుగా స్పందించారు. అసలు తనపై అనర్హత వేటు చెల్లదన్నారు. వైసీపీ చెప్తున్న కారణాలతో అనర్హత వేటు వేయడం సాధ్యం కాదన్నారు. అంతటితో ఆగకుండా వైసీపీ సర్కార్ చర్యలపై లోక్సభలోనే తేల్చుకునేందుకు ఆయన సిద్దమవుతున్నారు. ఇందుకోసం ప్రివిలేజ్ మోషన్ను ఆయుధంగా ఎంచుకుంటున్నారు. దీంతో లోక్సభ స్పీకర్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.
Recommended Video
వైసీపీ ఫిర్యాదుపై రఘురామ రియాక్షన్
వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ గతంలో ఓసారి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నేతలు తాజాగా మరోసారి ఫిర్యాదు చేశారు. సీఐడీ అరెస్టు తర్వాత పరిణామాల్లో వైసీపీని పదే పదే ఇరుకునపెడుతున్న రఘురామపై వేటు వేయాల్సిందేనని స్పీకర్ను కోరారు. తాజాగా రఘురామరాజు చర్యల్ని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. వైసీపీ ఎంపీ భరత్ చేసిన ఫిర్యాదుపై రఘురామ స్పందన ఆసక్తికరంగా మారింది.
అనర్హత సాధ్యం కాదన్న రఘురామ
తనపై వైసీపీ ఎంపీ భరత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా లోక్సభ స్పీకర్ అనర్హత వేటు వేస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో రఘురామ దీనిపై స్పందించారు. తనపై అనర్హత వేటు సాధ్యం కాదన్నారు. తాను ఏ పార్టీతో జట్టు కట్టలేదని, అధికార పార్టీకి విరుద్ధంగా వ్యవహరించలేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లోపాల్ని మాత్రమే ప్రస్తావించానని, కాబట్టి తనపై అనర్హత వేటు వయడం సాధ్యం కాదని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. దాదాపు ఏడాదిన్నరగా వైసీపీపై పోరాటం చేస్తున్న రఘురామ ఏ ధీమాతో అలా చెప్పగలుగుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే యత్నం
కొందరు తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునేందుకే తాను ప్రయత్నించానని, ఎలాంటి పార్టీ విరుద్ధ కార్యక్రమాలకు తాను పాల్పడలేదని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. వాస్తవాలు ఎప్పటికైనా బయటికి వస్తాయన్నారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే నాలుగైదు సార్లు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారని రఘురామ వెల్లడించారు. తనపై ఈ నెల 10న లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసి 11న చేసినట్లు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు.
అనర్హతకు కౌంటర్గా ప్రివిలేజ్ మోషన్
వైసీపీ ఎంపీలు తనకు వ్యతిరేకంగా లోక్సభ స్పీకర్కు అనర్హత వేటు వేయాంటు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాను కూడా లోక్సభలోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని రఘురామ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఐడీ కస్టడీలో తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఎంపీలకు లేఖలు రాసిన రఘురామ.. ఇప్పుడు అదే విషయాన్ని ప్రివిలేజ్ మోషన్ రూపంలో లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే రఘురామ కుటుంబ సభ్యులు సీఐడీ కస్టడీలో దాడిపై లోక్సభ స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు రఘురామ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.