నాకు తోచింది మాట్లాడుతా, చంద్రబాబులా నేను కష్టపడలేకపోతున్నా: రాయపాటి
గుంటూరు: నేను నాకు తోచింది మాట్లాడుతానని, తన బ్లడ్లో కాంగ్రెస్ రక్తం పోయి.. తెలుగుదేశం పార్టీ బ్లడ్ వచ్చిందని ఎంపీ రాయపాటి సాంబశివ రావు అన్నారు. తాను కొన్ని కారణాల వల్ల నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లో కొనసాగాల్సి వచ్చిందన్నారు. ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఏదైనా విషయంపై ఆ సందర్భంలో తనకు తోచిందే మాట్లాడతానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ మొదలైన అంశాలపై గతంలో ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడంపై స్పందిస్తూ... రైల్వే జోన్ తమ ప్రాంతానికి వస్తేనే బాగుంటుందన్నారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
గత పదేళ్ల కాలంలో మాచర్ల, గురజాల, వినుకొండ వంటి ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయని, కాంగ్రెస్ పాలనలో ఆ ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కష్టపడినట్లు తాను కష్టపడలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడతారని, నేను పది గంటలు కూడా కష్టపడలేకపోతున్నానన్నారు. వయసు రీత్యా తాను ఎక్కువగా పని చేయలేకపోతున్నానని చెప్పారు. 1982లో తానెవరో పూర్తిగా తెలియనప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు తాను నామినేషన్ వేసే అవకాశాన్ని ఇందిరాగాంధీ కల్పించారన్నారు.
ఆనాటి నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో సాన్నిహిత్యం ఉందని, వాళ్ల ఇంట్లో సభ్యుడిగానే మెలిగానన్నారు. ఇప్పుడు నా నుంచి కాంగ్రెస్ బ్లడ్ పోయిందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ఉన్నట్లయితే కాంగ్రెస్ రక్తమే తనలో ఉండేదన్నారు.
ఇప్పుడు వాళ్లు లేరు కనుక తెలుగుదేశం పార్టీ రక్తం తనలోకి కొత్తగా వచ్చిందన్నారు. ఇందిరా, రాజీవ్లు ఉండగా నేను అపాయింటుమెంట్ లేకుండా వాళ్ల ఇంటికి నేరుగా వెళ్లేవాడనని చెప్పారు. చంద్రబాబు కూడా తనకు మొదటి నుంచి శ్రేయోభిలాషి అని చెప్పారు.