బైక్ పై స్పీడ్ తగ్గించుకోవాలి -సాయి తేజ్ హెల్మెట్ ధరించడం : విజయసాయిరెడ్డి రియాక్షన్..!!
రోడ్డు ప్రమాదంలో గాయ పడిన టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. సినీ - రాజకీయ ప్రముఖులు సాయిధరమ్ తేజ్ ను పరామర్శిస్తున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ ను తొలుత సమీపంలోని మెడికోవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాధమిక చికిత్స తరువాత అపోలోకు తరలించారు. ఆయన ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే చిరంజీవి - పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు.
తొలుత వైద్యులు ఐసీయులో చికిత్స చేస్తూ వెంటిలేటర్ ఏర్పాటు చేసారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. సాయిధరమ్ తేజ్ కు చేతి పైన..ఛాతీ..పొట్ట పైన గాయాలు అయినట్లుగా నిర్ధారించారు. ఎటువంటి అపాయం లేదని వైద్యులు ప్రకటించారు. ఈ రోజు కొన్ని పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆదివారం మరో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. అయితే, సాయిధరమ్ తేజ్ కు బైక్ రేసింగ్ అంటే ఇష్టమని తెలుస్తోంది. ఆయన సినీ నటుడు నరేశ్ కుమారుడితో కలిసి బైక్ రేసింగ్ లో పాల్గొనే వారనే నరేశ్ చెప్పారు.
తాను వానికి రేసింగ్ లు వద్దని చెప్పానని గుర్తు చేసారు. తమ ఇంటి నుంచే సాయిధరమ్ తేజ్ వెళ్లారని వివరించారు. అయితే, ప్రమాదానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ విడుదల అయింది. అందులో రోడ్డు పైన బండి స్కిట్ అయి ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. ఇక, అపోలో లో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ను ముందుగా రాం చరణ్ - ఉపాసన దంపతులు పరామర్శించగా.. ఆ తరువాత చిరంజీవి -సురేఖ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ తిరిగి బయటకు వస్తారని చిరంజీవి చెప్పారు.
ప్రకాశ్ రాజ్.. మంచు లక్ష్మీ , శ్రీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఆస్పత్రిలో పరామర్శించారు. తాజాగా వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. సాయి తేజ్ హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని విజయసాయి ట్వీట్ చేశారు. అయితే, సాయి ధరమ్ తేజ్ ప్రమాదం పైన పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసారు. బైక్ రేసింగ్ ల పైన ఫోకస్ పెట్టారు. అదే సమయంలో సినీ పెద్దలు సైతం ఈ బైక్ రేసింగ్ లపైన చర్చలు చేస్తున్నారు.
Recommended Video
ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2021