వాలంటీర్ వ్యవస్థపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు - పవన్ విమర్శల వేళ..!!
ఏపీలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా నిల్యం వాలంటీర్ వ్యవస్థ పైన ఆరోపణలు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. దీని పైన పెద్ద దుమారమే కొనసాగుతోంది. ఈ సమయంలోనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ అందిస్తున్న సేవలు..పొరుగు రాష్ట్రాలు అమలు దిశగా చేస్తున్న ఆలోచనలను వివరించారు.
ఎనలేని మేలు: ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సేవలను అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్లు చక్కగా నిర్వహిస్తున్నారని సాయిరెడ్డి పేర్కొన్నారు. లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సామాన్య ప్రజానీకానికి ఈ వలంటీర్ల వ్యవస్థ ఎనలేని మేలు చేస్తోందన్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పనితీరుపై పేద, మధ్యతరగతి ప్రజల్లో సదభిప్రాయం బలపడుతోంది చెప్పారు.

ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున పనిచేసే ఈ వినూత్న వ్యవస్థను నడపడానికి వారి వేతనాల (గౌరవవేతనం) కింద ఏటా రూ.1200 కోట్లు చెల్లిస్తున్నారని వివరించారు.అవసరమైన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ, వార్డు వలంటీర్లు ప్రజలకు నిజమైన సేవలందించించే డెలివరీ సిస్టంలో కీలకపాత్రధారులయ్యారని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రజాసేవకులుగానే: ప్రజలకు కూతవేటు దూరంలో ఉండే వలంటీర్లు ప్రజాసేవకులుగానే వ్యవహరిస్తున్నారు కాని, ప్రతిపక్షాలు నిందిస్తున్నట్టు పాలకపక్షం ప్రతినిధులుగా కాదని సాయిరెడ్డి పేర్కొన్నారు. రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోందన్నారు. గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ పట్టాలెక్కి ఆశించిన దాని కన్నా ఎక్కువ వేగంతో ముందుకు సాగిందన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలకంగా వ్యవహరించే దాదాపు పదిహేన వేల మందికి పైగా గ్రామ, వార్డు కార్యదర్శులు తోడు కావడంతో వలంటీర్ల వ్యవస్థ మరింత చలనశీలంగా సాగుతోందని చెప్పారు. కనీవినీ ఎరగని రీతిలో ఎన్నో రకాల సేవలను ప్రజల గుమ్మం ముందుకే ఈ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు తీుకొచ్చాయని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా గుర్తింపు: వాలంటీర్ వ్యవస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణలో కూడా అధికార వికేంద్రీకరణకు ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలనే ఆలోచన వచ్చిందని తెలుస్తోందని చెప్పుకొచ్చారు. తమిళనాడు సైతం గ్రామ సచివాలయాల ఫక్కీలో గ్రామీణ ప్రాంతాల్లో 600కి పైగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు 2022లో ప్రకటించిందని గుర్తు చేసారు.
వాటిలో పాలనా సౌకర్యాలు, సమావేశ మందిరాలు ఉండేలా చూడాలని తమిళ సర్కారు యోచిస్తోందని చెప్పారు. ఎవరెన్ని వివాదాలు లేవనెత్తినా పాతికకు పైగా ఉన్న ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మాత్రం వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని సాయిరెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications