తెలంగాణాలో అటవీ అందాలు, నదులపై వంతెనలతో సాగే కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే
భారత్ మాలా ప్రాజెక్ట్ లో భాగంగా తెలంగాణాకు కేంద్రం మరో వరం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మంచిర్యాల ,కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్ర లోని గడ్చిరోలి వరకు సాగే బెల్లంపల్లి గడ్చిరోలి నాలుగు లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్ట్ నిర్మాణానికి మళ్ళీ అడుగులు పడుతున్నాయి.
బెల్లంపల్లి- గడ్చిరోలి నాలుగు లేన్ల రహదారి ప్రాజెక్ట్ పై వ్యాపారవేత్తలలో కొత్త ఆశలు
దట్టమైన అటవీ ప్రాంతాలు, వాగుల గుండా సాగే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం మూడేళ్ళ క్రితం అంకురార్పణ జరిగినా ఇప్పుడు మళ్ళీ కదలిక మొదలైంది. బెల్లంపల్లి- గడ్చిరోలి నాలుగు లేన్ల రహదారి ప్రాజెక్ట్ పై స్థానికులు, వ్యాపారవేత్తలలో కొత్త ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఈ రహదారి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి వ్యాపార వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు 63.2 కిలోమీటర్ల పొడవున ఈ ఫోర్ లేన్ హైవే
మంచిర్యాల జిల్లా తాండూరు నుంచి ప్రారంభమై మొత్తం మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు 63.2 కిలోమీటర్ల పొడవున ఈ ఫోర్ లేన్ హైవే నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 1200 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు ప్లాన్ చేశారు. మూడేళ్ళ క్రితం అనుమతులు మంజూరు కాగా, రెండు రాష్ట్రాల్లో ప్రాధమిక సర్వేలు పూర్తయ్యాయి.
వీరవెల్లి వద్ద వార్డానదిపై వంతెన
ఈ హైవే మార్గం తాండూర్, కాసీపేట, బెల్లంపల్లి, భీమిని, రెబ్బెన, దహేగాం, కాగజ్ నగర్, సిర్పూర్ (టి), కౌటాల మండలాల పరిధిలోని పలు గ్రామాల మీదుగా వెళ్తుంది. ఇది దట్టమైన అడవులు, వాగులు, నదులను దాటుకుంటూ సాగే రహదారిగా ఉండనుంది. అయితే ఈ రహదారిలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలోని వీరవెల్లి వద్ద వార్డానదిపై వంతెన నిర్మించి మహారాష్ట్రలోని కిర్ మిరి నుండి గడ్చిరోలి వరకు ఉన్న ప్రధానరహదారికి అనుసంధానం చేయనున్నారు.
నితిన్ గడ్కరీని కలవటంతో ప్రాజెక్ట్ లో కదలిక
అయితే అటవీ ప్రాంతం కావటంతో అనుమతులు ఆలస్యం కాగా, ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధులు నితిన్ గడ్కరీని కలవటంతో మళ్ళీ ప్రాజెక్ట్ లో కదలిక మొదలైంది. కాగజ్ నగర్, సిర్పూర్, కౌటాల మండలాలలో ఇప్పటికే సర్వేలు పూర్తి అయ్యాయి. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి మహారాష్ట్రకి రాకపోకలు సాగించే వారికి ప్రయాణం సులభతరమవుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలు బలపడతాయి. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications