2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడే..!!
ఏపీలో మరో అయిదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ - జనసేన ఒక్కటయ్యాయి. జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ ఆలోచన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. కేసుల వ్యవహారంతో చంద్రబాబు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పవన్ ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ఏపీలో ఏం జరుగుతోంది..ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఏపీలో వార్ వన్ సైడే : ఏపీలో మర్చి - ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపుతున్నారు. పథకాల అమలు షెడ్యూల్ ఖరారు చేసారు. సంక్షేమం - సామాజిక సమతుల్యత అంశాల ఆధారంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశం పైన వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆసక్తి కర సమీకరణాలతో విశ్లేషించారు.

1982 మార్చిలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019 వరకూ తొమ్మిదిసార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం ఓడిపోయిన 1989, 2004, 2009, 2019 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయాల్లో గెలుపు ఏ పార్టీదనే సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉండేదిని పేర్కొన్నారు. టీడీపీ ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభం, ప్రజలకు, వారి ఆలోచనలకూ ఈ పార్టీ అధినేత దూరమైన తీరును నిశితంగా పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే సందేహం ఏర్పడిందన్నారు.
టీడీపీ కోలుకోవటం లేదు: 2019 ఎన్నికల్లో ఫలితాలు వన్ సైడ్ అయ్యాయని సాయిరెడ్డి గుర్తు చేసారు. కలలో కూడా అంతటి ఘోర పరాజయం ఊహించని చంద్రబాబు పార్టీకి గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా సంపాదించడానికి అవసరమైన 18 సీట్ల కంటే అదనంగా ఐదు మాత్రమే వచ్చాయన్నారు. టీడీపీ 175 స్థానాల్లో 23 చోట్లే టీడీపీ గెలిచిందని చెప్పారు. ప్రజాదరణ, ఓటర్ల విశ్వాసం మెండుగా ఉన్న జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ 49.5 శాతం ఓట్లతో 86.28 శాతం సీట్లు (151) కైవసం చేసుకుందని వివరించారు.
నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఓడిపోయిన మొదటి, చివరి సందర్భంలో (1989 డిసెంబర్) సైతం ఈ పార్టీ మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 74 గెలుచుకోగలిగిందని చెప్పారు. అంటే. 25 శాతం స్థానాల్లో విజయం సాధించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వాన (తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ పార్టీ దాదాపు 16 శాతం సీట్లను (294కు 47) సాధించగలిగిందని వివరించారు.

2019లో అధికారం వైసీపీదే : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు, తెలుగుదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంటే 2019 ఎన్నికల్లో సాధించిన 13.1% సీట్లు ఈ పార్టీకి అత్యంత కనిష్ఠమైనవని అనుకోవడానికి వీలు లేదనిపిస్తోందని విశ్లేషించారు. 1976 జనవరి 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కేంద్ర సర్కారు తమిళనాడు రెండో డీఎంకే ముఖ్యమంత్రి కరుణానిధి సర్కారును బర్తరఫ్ చేసింది.
ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా వరుసగా మూడు ఎన్నికల్లో (1977, 1980, 1985) డీఎంకే ఓడిపోయింది. చివరికి 1989 జనవరి ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించాక కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారని సాయిరెడ్డి గుర్తు చేసారు. కానీ, ఆ స్థాయి సమర్ధత చంద్రబాబులో లేదని విశ్లేషించారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపి విజయం ఖాయమని సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications