రాజీనామాకు సిద్దం - వైసీపీ నేత విజయ సాయిరెడ్డి సంచలనం..!!
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పైన కేంద్ర రైల్వే బోర్డు సాధ్యం కాదని చెప్పిందనే వార్తల పైన ఆయన స్పందించారు. తాజాగా ఏపీ పునర్విభజన చట్టం పైన ఢిల్లీలో హోం శాఖ ఏపీ -తెలంగాణ అధికారులతో సమీక్ష చేసారు. అందులో రైల్వే జోన్ అంశం పైన చర్చకు రాగా, విశాఖ రైల్వే జోన్ ఫీజబులిటీ లేదంటూ రైల్వే శాఖ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి స్పందించారని, అలా చెప్పటం సరికాదంటూనే..ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్ కు నివేదించాలని సూచించారు.
జోన్ రాకుంటే రాజీనామా చేస్తా
కేంద్రం దాని పైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. దీని పైన సాయిరెడ్డి స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు. అసలు మంగళవారం జరిగిన సమావేశ:లో రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదన్నారు. ఏపీ రాజధాని నుంచి కోవూరు మీదుగా తెలంగాణ కు లైన్ ఏర్పాటు పైన గతంలోనూ చర్చ జరిగిందని..ఇప్పుడూ అదే ,చర్చ జరిగిందని వివరించారు.
విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ..ఉత్తరాంధ్ర నేతలు తమ వంతు పోరాటం చేసారని గుర్తు చేసారు. విశాఖ రైల్వే జోన్ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారని..పార్లమెంట్ లో చట్టంగా మారిన తరువాత మార్పు ఉండదని స్పష్టం చేసారు. విశాఖకు రైల్వే జోన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పుకొచ్చిన విజయ సాయిరెడ్డి.. విశాఖకు రైల్వే జోన్ రాకుంటే తాను రాజీనామాకు సిద్దమని సంచలన ప్రకటన చేసారు.
విభజన చట్టం ప్రకారం రైల్వే జోన్
2014 రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2019 విశాఖకు రైల్వే జోన్ ప్రతిపాదించారు. దీనికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 2019 ఫిబ్రవరి 17న అప్పటి రైల్వేమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుత మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం.. త్వరలో జోన్ ప్రారంభమవుతుందని స్థలమూ ఎంపిక చేశామని, కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెబుతూ వచ్చారు.
కానీ.. జోన్ కార్యకలాపాలు మొదలవుతాయని ఎదురుచూస్తున్నప్పటికీ అమలు కాలేదు. ఈ సమయంలో రైల్వే బోర్డు వైజాగ్ రైల్వే జోన్ కు ఫీజబులిటీ లేదంటూ నివేదికలు ఇచ్చినట్లుగా తాజాగా జరిగిన హోం శాఖ సమావేశంలో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
కేంద్రం నుంచి స్పష్టత కోసం ఆరా
దీని పైన సాయి రెడ్డితో పాటుగా బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. రైల్వే జోన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతున్న సమయంలో..రైల్వే జోన్ పైన వస్తున్న వార్తలు మరింత వేడి పుట్టించాయి.
అయితే, వైసీపీ ముఖ్య నేతగా కేంద్రం - రాష్ట్ర వ్యవహారాల సంధాన కర్తగా ఉన్న విజయ సాయిరెడ్డి విశాఖ రైల్వే జోన్ పైన ధీమాగా ఉండటం.. జోన్ రాకుంటే తాను రాజీనామా చేస్తానని చెప్పటంతో ఇప్పుడు రాజకీయంగా ఈ అశం ఆసక్తి కరంగా మారుతోంది.