కరెంట్ కోతలు, విద్యుత్ ఛార్జీలు పెరగటానికి కారణాలు చెప్పిన ఎంపీ విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో మండుటెండా కాలంలో ప్రజలు నరకం చూస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న వారు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలంటేనే కరెంటు కోతల నేపథ్యంలో భయపెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నెలాఖరు నాటికి ఈ సరఫరా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని, పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయి అని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరీ ప్రకటించారు.
విద్యుత్ కోతలకు కారణం చెప్పిన విజయసాయి రెడ్డి
ఇక ఇదే సమయంలో విద్యుత్ కోతలకు గల కారణాలను, విద్యుత్ చార్జీలు పెరగడానికి గల కారణాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కరెంట్ కోతలపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొద్ది రోజుల్లో కరెంటు సమస్య చక్కబడుతుంది అంటూ పేర్కొన్నారు. తీవ్రమైన బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయిలో నడవడం లేదని, ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ 1.4 శాతం పెరిగి దేశవ్యాప్తంగా కరెంటు కొరత ఏర్పడిందని ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు.
గుజరాత్, మహారాష్ట్ర తో సహా పద్నాలుగు రాష్ట్రాలలో లోడ్ షెడ్డింగ్ తప్పడంలేదు
గుజరాత్, మహారాష్ట్ర తో సహా పద్నాలుగు రాష్ట్రాలలో లోడ్ షెడ్డింగ్ తప్పడం లేదని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే విద్యుత్ సమస్యలకు చెక్ పడుతుందని సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కరెంట్ కోతలపై ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో, ప్రజలకు సమస్య అర్థమయ్యేలా విజయసాయిరెడ్డి వెల్లడించారు.ఇక ఇదే సమయంలో పెరిగిన విద్యుత్ చార్జీలపై కూడా స్పందించిన విజయసాయి రెడ్డి బొగ్గు ధరలపై ప్రస్తావించారు.
విపరీతంగా పెరిగిన బొగ్గు ధరల వల్లే కరెంట్ ఛార్జీల పెంపు
థర్మల్ కేంద్రాలు దిగుమతి చేసుకునే బొగ్గు ధర టన్నుకు 500% పెరిగి రూ.24,450కి చేరిందని వెల్లడించారు. 2019 మేలో దీని ధరరూ.3,428 ఉండేది. కానీ ఇప్పుడు దీని ధర విపరీతంగా పెరిగిందని దాదాపు 25వేల రూపాయలకు చేరుకుందని ప్రకటించారు. ఏటా 9 కోట్ల టన్నుల బొగ్గు దిగుమతి అవుతోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. కరెంటు ధరలు పెరగటానికి ఇదే ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు.
బొగ్గు ఉత్పత్తిలో దేశంస్వయం సమృద్ధి సాధించేదాకా తప్పదన్న సాయిరెడ్డి
బొగ్గు ఉత్పత్తిలో దేశంస్వయం సమృద్ధి సాధించేదాకా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూడా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి ఈ క్రమంలోనే దేశంలో బొగ్గు కొరత వల్లే విద్యుత్తు సమస్య ఉత్పన్నమవుతుందని, బొగ్గు ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.