చంద్రబాబు బిగ్ మిస్టేక్: అదే జగన్కు వరం
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో నెలరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి మార్చి రెండో వారంలో షెడ్యూల్ విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవంక.. తెలుగుదేశం- జనసేన కూటమి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మరోవంక- ఈ ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నాయి.

వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలు, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నుంచి జనంలో వెళ్లనున్నారు. సిద్ధం పేరుతో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. తొలి సభ విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఏర్పాటుకానుంది.
వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో విడత జాబితాపై కసరత్తు సాగిస్తోంది. నేడో, రేపో ఈ జాబితా వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 15 మందితో ఈ లిస్ట్ వెలువడొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యులు, ఎంపీలు ఇప్పటి నుంచే పక్క చూపులు చూస్తోన్నారు. కర్నూలు, మచిలీపట్నం, నరసరావుపేట సిట్టింగ్ ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్, వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు.. పార్టీకి రాజీనామా చేశారు.
ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటింరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్.. వంటి నాయకులు ఇప్పటికే బయటికెళ్లారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. ప్రజల్లో వారికి ఆదరణ లేకపోవడం వల్లే టికెట్లు ఇవ్వట్లేదని వైసీపీ టాప్ క్యాడర్ తేల్చి చెబుతోంది.
ఈ పరిణామాలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి స్పందించారు. పని చేయని వారిని తమ పార్టీలోకి తీసుకుంటోన్న టీడీపీ, కాంగ్రెస్, జనసేనకు థ్యాంక్స్ చెప్పారు. జనాదరణ కోల్పోయిన వారిని చేర్చుకోవడం వల్ల ఆ పార్టీలు వైసీపీ రీసైక్లింగ్ డబ్బాలుగా మారాయని సెటైర్లు వేశారు.
ఓటర్లు వారిని తిరస్కరించారనే విషయాన్ని ముందుగా గుర్తించడం వల్లే వారికి టికెట్లను ఇవ్వదలచుకోలేదని, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సాయిరెడ్డి వివరించారు. అలాంటి నాయకులందరూ ప్రజా క్షేత్రంలో ఓడిపోవడం ఖాయమని, వైసీపీ విజయం నల్లేరు మీద నడకేనని వ్యాఖ్యానించారాయన.












Click it and Unblock the Notifications