ఎంపీల జంప్: మిగిలే ఎంపీలు జగన్ చుట్టాలే?
హైదరాబాద్: వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నలుగురు లోకసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసులో జగన్ బంధువులైన నలుగురు ఎంపీలు మాత్రమే మిగులుతారనే ప్రచారం సాగుతోంది.
జగన్ బంధువులైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి మాత్రమే పార్టీలో ఉంటారనే ప్రచారమూ నడుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎగబడ్డ నాయకులు పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి మెల్లమెల్లగా జారుకునేందుకు సిద్ధమవుతున్నారు.

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా తెలుగుదేశం అధినేతతో మాట్లాడి తంటాలు తెచ్చుకున్నారు. ఆమె కూడా పార్టీలో ఉంటారనే నమ్మకం లేదని అంటున్నారు. పార్టీకి ఆమె దూరమైనట్లేనని చెబుతున్నారు.
కేవలం అనర్హత వేటు భయంతోనే ఆమె నోరు మెదపడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తాజాగా అరకు పార్లమెంటరీ నాయకురాలు, ఎంపీ కొత్తపల్లి గీత కూడా కొత్త పల్లవి అందుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని బహిరంగంగా చెప్పేశారు. దీన్నిబట్టి ఆమె ఇక ఎంతో కాలం పార్టీలో ఉండరనీ, త్వరలో తెదేపా తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆమె వ్యాఖ్యలు పార్టీని ఆశ్చర్యానికేమీ గురిచేయలేదు. కానీ, ఆమెపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
మరోవైపు తిరుపతి ఎంపీ వరప్రసాదరావు కూడా పార్టీకి విశ్వాసపాత్రుడుగా లేరనే ప్రచారం జరుగుతోంది. అలా చూసినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు గెలుచుకున్న మొత్తం 8 ఎంపీల్లో నలుగురు గోడ దూకేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే మిగిలేది నలుగురు ఎంపీలే. ఆ ఎంపీలు కూడా జగన్ బంధువులే.












Click it and Unblock the Notifications