వైఎస్ జగన్, చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్న ఎంపీలు
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయ చర్చ తీవ్రంగా నడుస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే యోచనలో ప్రతిపక్షాలున్నాయి. అవి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా తమ నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి.

ycp నుంచి వీరే..
అయితే ఇరు పార్టీలకు చెందిన లోక్ సభ సభ్యులు పలువురు ఎమ్మెల్యేలుగా పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో కాకినాడ ఎంపీ వంగా గీతా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్తోపాటు మరికొంత మంది ఎంపీలు ఉన్నారు. దీనిపై అధిష్టానం నుంచి వారికి ఇంతవరకు హామీ లభించలేదు. ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే విషయమై వారు ఇప్పటికే ఒక ప్రణాళిక రచించుకొని అనుమతి కోసం వేచిచూస్తున్నారు.

అధినేత అనుమతి కోసం..
తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నర్సన్నపేట లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ విషయమై ఆయన అధినేతకు చెప్పారు. నరసన్నపేట ఇన్ఛార్జి కూడా సానుకూలంగానే ఉన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. అధినేత నుంచి అనుమతి లభించిందా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. గతఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అశోక్ గజపతిరాజు ఈ సారి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

జమ్మలమడుగు నుంచి ఆది
నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ సీనియర్ నేత వేటుకూరి శివరామరాజు రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ఈయన రెండుసార్లు ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర ఉంది. అలాగే హిందూపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నిమ్మల కిష్టప్ప సైతం అసెంబ్లీకి పోటీచేయడానికి మొగ్గుచూపుతున్నారు. పెనుకొండ సీటు కావాలంటూ అధినేతను అడుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కూడా ఈ సారి అసెంబ్లీ సీటుపై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. తాజాగా ఆయన జమ్మలమడుగు నియోజకవర్గంపై దృష్టి సారించారు. బీజేపీ నుంచి పోటీచేస్తారా? లేదంటే టీడీపీలో చేరి పోటీచేస్తారా? అనేది తేలలేదు. ఇంకా పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీచేయాలనుకుంటున్నప్పటికీ వైసీపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ అధిష్టానం అనుమతిస్తుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు.












Click it and Unblock the Notifications