మహిళా ఎమ్మార్వోపై దాడి: ఎవరీ చింతమనేని ప్రభాకర్?
హైదరాబాద్: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అసలు ఎవరీ చింతమనేని ప్రభాకర్?
చింతమనేని ప్రభాకర్ ఆది నుంచి వివాదాలకు మారు పేరు. తొలిసారిగా 2009లో దెందులూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతక ముందు పెదవేగి మండలానికి ఎంపీపీగా గెలుపొందారు. సంక్రాంతి సమయంలో కోడిపందేల నిర్వహణ విషయంలో తరచూ చింతమనేని పేరు తెరపైకి వస్తుంటుంది.
ఎంపీపీగా ఉన్నప్పటి నుంచే ఆయన ఇసుక వ్యాపారులకు అండగా ఉండేరని తెలుస్తోంది. 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్ష నేతలతో తరచూ వివాదాల్లోకి దిగి నిత్యం వార్తల్లో ఉండేవాడు.
వివిధ శాఖల అధికారులతో ఘర్షణ పడటం, దాడులకు దిగడం వంటి ఘటనల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఇప్పటికే 14 కేసులకుపైగా పెండింగ్లో ఉండగా ఏలూరు పోలీస్ స్టేషన్లో ఆయన రౌడీ షీటర్గా నమోదై ఉన్నారు.
2014లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ పదవి పొందారు. విప్ పదవి ఇచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు స్వయంగా చింతమనేనితో దూకుడు తగ్గించి బాధ్యతగా ఉండమని హెచ్చరించినట్లు సమాచారం. అయినా సరే ఆయన తీరులో ఎలాంటి మార్పులేదని తాజా ఘటనతో రుజువు అయింది.