మహేష్ కత్తి మృతిపై అనుమానాలు-సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి-మందకృష్ణ మాదిగ డిమాండ్
ప్రముఖ సినీ విశ్లేషకుడు,బహుజనవాది మహేష్ కత్తి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ కత్తి మృతిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విచారణకు డిమాండ్ చేశారు. నిజాయితీగల పోలీస్ అధికారితో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మహేష్ కత్తి మృతిపై విచారణ జరిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన కోరారు. నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి అపోలో ఆస్పత్రిలో మహేష్ కత్తి మరణం దాకా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం(జులై 12) చిత్తూరు జిల్లాలోని మహేష్ కత్తి స్వగ్రామం యలమందలో జరిగిన ఆయన అంత్యక్రియల్లో మందకృష్ణ పాల్గొన్నారు.
మందకృష్ణ ఏమన్నారంటే...
మహేష్ కత్తి మృతిపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలతో చాలామంది శత్రువులుగా తయారయ్యారని గతంలో జరిగిన ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. యాక్సిడెంట్,ఆస్పత్రిలో ఆయన మరణంపై అనుమానాలను నివృత్తిని చేయాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి మహేష్ కత్తి మరణించే నాటికి 15 రోజులు గడిచాయి. యాక్సిడెంట్ ఏవిధంగా జరిగింది.. మరణం ఎలా సంభవించింది... ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి లేదా సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ జరిపించాలి.' అని మందకృష్ణ డిమాండ్ చేశారు.
మందకృష్ణ అనుమానం...
'ఆరోజు రాత్రి 12గం. సమయంలో విజయవాడ నుంచి మహేష్ కత్తి కారులో బయలుదేరగా... నెల్లూరుకు 13కి.మీ దూరంలో యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ సీటులో సురేశ్ అనే సోదరుడు,పక్క సీటులో మహేష్ కూర్చొన్నారు. మహేష్ కూర్చొన్న కుడివైపే ప్రమాదం జరిగింది. ఆ పక్కన కూర్చొన్న సురేష్కు ఏ చిన్న గాయం తగలకుండా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత మొదట నెల్లూరు ఆస్పత్రికి.. ఆపై చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి మహేష్ కత్తి మామతో పాటు చిత్తూరు,పాండిచ్చేరి ఎమ్మార్పీఎస్ నాయకులతో నేను టచ్లో ఉన్నాను. మహేష్ కత్తికి ప్రమాదమేమీ లేదని చెప్పారు. వైద్యులు కూడా ఒక కన్ను తీసేయాల్సి వస్తుందని... కానీ ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని చెప్పారు. మరో 3,4రోజుల్లో మహేష్ను డిశ్చార్జి చేస్తామని కూడా చెప్పారన్నారు.' అని మందకృష్ణ పేర్కొన్నారు.
మరణించడానికి ఎవరైనా ప్లాన్ చేశారా : మందకృష్ణ
'మహేష్ కత్తి చనిపోయిన శనివారం(జులై 10)... ఆయన మరణానికి కేవలం ఐదు నిమిషాల ముందు సీరియస్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిసింది. ఆ తర్వాత మహేష్ కత్తి చనిపోయారని చెప్పారు. అపోలో ఆస్పత్రిలో ఆయనకు అందించిన చికిత్స వివరాలను వెల్లడించాలి. మహేష్ కత్తికి జరిగిన రోడ్డు ప్రమాదం,ఆయన మరణంలో అన్ని వాస్తవాలు వెలుగుచూడాలి. మేము పరివర్తన కోరుకునే మనుషులమే తప్ప ప్రతీకారం కోరుకోము.డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ స్పూర్తితో ఉన్నవాళ్లం. మహేష్ కత్తి మరణం తర్వాత వస్తున్న కామెంట్లను చూస్తుంటే ఆయన మరణించాలని ఎంతగా కోరుకున్నారో అర్థమవుతోంది. కాబట్టి ఆయన మరణించడానికి ఎవరైనా ప్లాన్ చేశారా అన్న అనుమానం కలుగుతోంది.' అని మందకృష్ణ అభిప్రాయపడ్డారు.
Recommended Video
ముగిసిన అంత్యక్రియలు
చిత్తూరు జిల్లాలోని మహేష్ కత్తి స్వగ్రామం యలమందలో సోమవారం(జులై 12) ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ,ఆ సంస్థ కార్యకర్తలు,రెల్లి కార్పోరేషన్ ఛైర్మన్ మధుసూదన్ రావు,పలువురు ప్రజాస్వామిక వాదులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కాగా,మహేష్ కత్తి సినీ విమర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు సాహిత్య,సామాజిక,రాజకీయ అంశాలపై సైతం మహేష్ కత్తి తనదైన శైలిలో విశ్లేషణలు చేసేవారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడం,ఆయన హైదరాబాద్ నుంచి కొన్నాళ్ల పాటు బహిష్కరణకు గురవడం తెలిసిందే.