రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు.. చంద్రబాబు సంచలన నిర్ణయాలు!!
ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈ ల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి, వాటికి చేయూతను ఇస్తుందని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని సిఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునేలా కసరత్తు
అనేక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరతిగతిన పూర్తి చేసి వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సిఎం పేర్కొన్నారు.

ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటులోను రైతుల భాగస్వామ్యం
భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్క్ లు ఏర్పాటుచేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజధానిలో ఎలాగైతే రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ది చేకూర్చామో...అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటులోను అవలంబించాలన్నారు. పూణె వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలన్నారు చంద్రబాబు.
పరిశ్రమలకు సులభంగా అనుమతులు
పరిశ్రమల ఏర్పాటులో అర్థంలేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని సిఎం అదేశించారు. అంతేకాదు ఆటోమేటిక్ గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు. డ్వాక్రా సంఘాల వంటి వాటిని ఎంఎస్ఎంఇలతో అనుసంధానం చేయాలన్నారు.
నిర్మాణంలో ఉన్న 7 క్లస్టర్ లను పూర్తి చెయ్యాలి
. ఆటోనగర్లను మోడ్రనైజేషన్ చేయాలని, ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలని సిఎం అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 క్లస్టర్ లను పూర్తి చెయ్యాలన్నారు. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారెంటీకి రూ. 100 కోట్లు కేటాయిస్తామని సిఎం తెలిపారు. విశ్వకర్మవంటి కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ అందేలా చూడాలని అన్నారు.
ఆహార శుద్ది పరిశ్రమకు రాష్ట్రంలో అపార అవకాశాలు
రాష్ట్రంలో ఆహారశుద్ది రంగంపై సిఎం సమీక్ష చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు రాష్ట్రంలో అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ ఉత్తత్తులకు...ఆహార శుద్ది పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయని సిఎం అన్నారు. రైతులు తాము పండించే పంటలకు వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా పాలసీ తీసుకురావాలని సిఎం అన్నారు. పుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి గ్రామాల్లో ప్రోత్సాహం ఇచ్చే విధంగా విధానాలు తీసుకురావాలని సూచించారు.












Click it and Unblock the Notifications