వెనక్కి తగ్గేది లేదు.. భారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిన ముద్రగడ!
శుక్రవారం నాడు అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ ప్రణాళికను ప్రకటించారు.
అమలాపురం: కాపు రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వం జాప్యం కనబరుస్తోందంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తపడుతూనే కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ సూచించారు.
కాపు రిజర్వేషన్లపై బీసీ నాయకుల మద్దతు కూడగట్టేందుకు త్వరలోనే బీసీ ముఖ్య నాయకులను కలవబోతున్నట్టుగా ముద్రగడ ప్రకటించారు. శుక్రవారం నాడు అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముద్రగడ.. కాపు ఉద్యమాన్ని మరో దఫా ఉధృతం చేసేందుకు భారీ కార్యాచరణ ప్రకటించారు.
ఈ నెల 18వ తేదీన అన్ని నియోజవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు తెలుపుతామని ముద్రగడ పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాల్లో కాపులంతా కంచాలు, గరిటెలు పట్టుకొని ముఖ్య కూడళ్లలో ఆందోళనలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో జరిగే నిరసన కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పుకొచ్చారు.
నిరసన కార్యక్రమాల్లో భాగంగా.. ఈ నెల 30వ తేదీన సీఎం సహా ప్రజా ప్రతినిధులందరికీ లేఖలు రాస్తామని ముద్రగడ చెప్పారు. అలాగే జనవరి 9న గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన, జనవరి 25వ తేదీ నుంచి పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు సాధించేంతవరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.