పవన్ కళ్యాణ్కు 'ప్రశ్న' చిక్కు: వ్యూహాత్మక మౌనమా, మనసులో ఏముంది?
విజయవాడ: ఓ వైపు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తుండగా.. కాపు నేతలు చాలామంది బయటకు వచ్చారు. ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. అయితే, జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు.
దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ కుల, మత రాజకీయాలకు దూరం. అయితే, సీఎం చంద్రబాబు హామీ నేపథ్యంలోనే ముద్రగడ దీక్ష చేస్తున్నారని, కాపుల డిమాండ్లలో వాస్తవం ఉందని తెలిసి కాపు నేతలు చిరంజీవి, దాసరి నారాయణ రావు, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ తదితరులు బయటకొచ్చారు.
కానీ, ఇప్పటి దాకా పవన్ మాత్రం ఈ అంశం పైన మాట్లాడలేదు. గతంలో తుని ఘటన సమయంలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి... కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అదే సమయంలో తుని విధ్వంసం సరికాదని చెప్పారు.
ముద్రగడ దీక్ష పన్నెండు రోజులకు చేరినా పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు. తుని ఘటన సమయంలో పవన్ బయటకు రావడం వెనుక... చంద్రబాబుకు అండగా నిలిచేందుకేననే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పవన్ అదే రకంగా ఎందుకు బయటకు రావడం లేదనే చర్చ సాగుతోంది.
పవన్ మనసులో ఏముందో!?
గతంలో రాజధాని భూముల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కాపు హామీల విషయంలోను టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో, చంద్రబాబుకు మద్దతుగా నిలిచేందుకే ఆయన బయటకు వచ్చారని విపక్షాలు మండిపడ్డాయి.
ఇప్పుడు రాకపోవడంతో... అసలు పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం పవన్ స్పందించకపోవడాన్ని చూస్తుంటే గతంలో చంద్రబాబుకు మద్దతుగా బయటకు వచ్చిన పవన్ ఇప్పుడు ఆయన పట్ల అసంతృప్తితో రావడం లేదా? లేక ముద్రగడ దీక్షలో న్యాయం ఉందని భావించే, బాబుకు అండగా బయటకు రాలేదా? అనే చర్చ సాగుతోంది.
లేదా కాపులకు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్నామని, ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు కేటాయించామని, బీసీలలో చేర్చేందుకు ముందుకెళ్తున్నామని చెబుతున్న టిడిపి నేతల వ్యాఖ్యల నేపథ్యంలోనే బయటకు రాలేదా? అనే చర్చ సాగుతోంది.
పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనమే పాటిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు పలికితే కాపులు పక్కన పెడతారని, ముద్రగడకు మద్దతు పలికితే.. హామీలు నెరవేర్చే దిశలో పని చేస్తున్నప్పటికీ ప్రశ్నించడం ఏమిటని ఎదురు ప్రశ్నలకు ఆస్కారం ఉంటుందనే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
ముద్రగడ దీక్ష పైన పవన్ కళ్యాణ్ సహా కాపు నేతలు స్పందించాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు. అయితే, కాపు నేతల భేటీలో మాత్రం పవన్ కళ్యాణ్ అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. పవన్ స్పందించాలని ముఖ్య కాపు నేతలు కూడా డిమాండ్ చేయలేదు.