ఎయిర్ పోర్టులో చిరంజీవి, రఘువీరా రెడ్డి అరెస్ట్: చంద్రబాబు వల్లే: దాసరి
రాజమహేంద్రవరం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను రాజమహేంద్రవరంలోనే పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. కాపులకు రిజర్వేషన్ల కావాలని ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్నారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు సోమవారం ఎంపీ చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి రాజమహేంద్రవరం వెళ్లారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గాన కిర్లంపూడి వెళ్లాలని భావించారు. అయితే, రాజమండ్రి విమానాశ్రయంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. చిరంజీవి, రఘువీరా రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
వారిని విడుదల చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే, వారిని అరెస్టు చేయలేదని, విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా మాత్రమే పోలీసులు అడ్డుకున్నారని అంటున్నారు.
ప్రత్యేక హోదా సాధించలేదని కాని: రామకృష్ణ
ప్రత్యేక హోదా సాధించలేదని చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఎలా సాధిస్తారని సిపిఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. తమకు ఓటు వేశారు కాబట్టి కాపులకు మేం రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు.
కాపులకు రిజర్వేషన్లు అంటూ ఇటు కాపులను, అటు బీసీలను చంద్రబాబు మోసం చేస్తున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు. ప్రయివేటు రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం తాము ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
సమస్యను ప్రభుత్వమే పెంచింది: దాసరి
కాపు రిజర్వేషన్ల అంశం సమస్యను ప్రభుత్వం వల్లే పెరిగి పెద్దదయిందని దర్శకరత్న దాసరి నారాయణ రావు అభిప్రాయపడ్డారు. సమస్యను ప్రభుత్వం డీల్ చేసిన విధానమే తప్పన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తొందరపడిందన్నారు.