తిరగబడితే మీకు పుట్టగతులుండవ్, టెర్రరిస్టులమా?: చంద్రబాబుకు ముద్రగడ హెచ్చరిక
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాపు బహిరంగ సభ నిర్వహించి తీరుతామని, తాము తిరగబడితే పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఓ లేఖను పంపించారు.
ముద్రగడ తన లేఖలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. ఓ దినపత్రికలో తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని, చంద్రబాబుకు దమ్ముంటే తన పేరుతోనే వార్తలు రాయించవచ్చని ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు.
‘తమరి పరిపానలో కుల సమాశం మాజాతి తప్ప ఎవరైనా పెట్టుకోవచ్చా? మీ సొంత సామాజిక వర్గం తరచూ పెట్టుకున్నా అభ్యంతరం లేదా? మాజాతి తాలిబన్ టెర్రరిస్టుల్లాంటి వారా? లేక ఏ దేశం నుంచైనా తన్ని తరిమేస్తే ఈ దేశానికి వచ్చినవారమా? ఈ కరివేపాకు జాతి అంతరించి పోవాలని మీజాతిలో కొందరి పెద్దల ఆరాటమా? భారత రాజ్యాంగంలో ఈ జాతి వారు సభలు పెట్టుకోకూడదని ఆంక్షలేమైనా ఉన్నాయా? మీ జాతి వారు మీ సహకారంతో విదేశాలలో కుల సభలు పెట్టుకోవడం లేదా?' అని లేఖ ప్రశ్నించారు.
‘ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్లు, ఏటా రూ. 1000 కోట్లు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇవ్వడం వల్లే మీరు గద్దెనెక్కారు. కోరిక తీరిన తర్వాత వామనమూర్తి బలిచక్రవర్తిని అభినందిస్తూ పాతాళానికి తొక్కినట్లుగా కాపు జాతి ఓట్లతో నెగ్గి, వారిని మీ పాదాలతోనే అధ:పాతాళానికి తొక్కివేయాలనే ఆలోచన మహాపాపం' అని పేర్కొన్నారు.
‘వంగవీటి రంగాని చంపినప్పుడు ఈ జాతిపై తడా చట్టం ప్రయోగించినప్పుడు కూడా కాకినాడలో పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నామే, ఎన్నో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో సభలు జరుపుకున్న సందర్భాలలో లేని ఆంక్షలు 2016 జనవరి ఆఖరి వరకు పెట్టడంలో గల ఆంతర్యం ఈ కాపు జాతిని యుద్ధానికి ముందే ఆహ్వానించడమా?, కయ్యానికి కాలు దువ్వడమా?' అని నిలదీశారు.
‘రాజ్యాంగం, చట్టాలు మీ కులం లేక మీ కుటుంబం కోసం తయారు చేసినవి కావు. ప్రజల కోసం ఎప్పటికప్పుడు చట్టాలు మార్పు చేసుకోవచ్చు. అలాంటిది మాకులం సమస్య వచ్చినప్పుడు వంకరగా మాట్లాడటం ఆపండి. ఈ ఉద్యమంలో మా సోదర సోదరీమణులపై లాఠీలు ఎత్తితే తగిన మూల్యం చెల్లించక తప్పదు' అని ముద్రగడ హెచ్చరించారు.
1910 నుంచి 1956 వరకు, 1961 నుంచి 1966 వరకు మా కాపు జాతి అనుభవించిన బీసీ రిజర్వేషన్లు వెంటనే పునరుద్ధరించాలి. రాజ్యాంగ బద్ధంగా ఇచ్చిన జీఓ నెం. 30/94 అమలు చేయాలి. లేదా కాపు జాతిని బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించమని మరో కొత్త జీఓ అయినా విడుదల చేసి.. అసెంబ్లీలో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్రానికి పంపండి తప్ప కమిషన్లు వేసి ఈ జాతిని మోసం చేయండి' అని ముద్రగఢ తన లేఖలో పేర్కొన్నారు.