దానికి పవన్ కల్యాణ్ సరి తూగడు: ముద్రగడ సంచలన వ్యాఖ్య
తిరుపతి: జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్య చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ కల్యాణ్ జెఎసి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్య చేశారు.
Recommended Video
తిరుపతిలో శనివారంనాడు ఆయన బలిజల ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్పై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన విరుచుకుపడ్డారు.
పవన్ కల్యాణ్ నాయకత్వం సరిపోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పవన్ కల్యాణ్ నాయకత్వం సరపోదని ముద్రగడ పద్మనాభం అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో, కేంద్ర మంత్రులతో నారా చంద్రబాబు నాయుడు రాజీనామలు చేయించి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆయన సూచించారు. అప్పుడు తమ జాతి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు.
అప్పుడే కాపులకు పండుగ
తహసీల్దార్ కార్యాలయం నుంచి బీసి సర్టిఫికెట్ పొందినప్పుడే కాపులకు పండుగ అని ముద్రగడ అన్నారు. చంద్రబాబుజాప్యం చేయడం వల్లనే కాపులంతా రోడ్డు మీదికి వచ్చారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని చంద్రబాబు త్రికరణ శుద్ధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎలా ఆకలి తీర్చుకోవాలో...
రాష్ట్రంలో జరిగే నియామకాల్లో బీసి ఎఫ్ ద్వారా కాపులకు న్యాయం చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఎలా ఆకలి తీర్చుకోవాలో తమకు తెలుసునని ఆయన అన్నారు.
ఎలా మోసం చేయాలో తెలుసు
సరైన సమయంలో ఉద్యమించి ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెబుతామని ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపులను మోసం చేయాలని చూస్తే తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు ఎలా మోసం చేయాలో నిర్ణయిస్తామని ఆయన అన్నారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వెనకడుగు వేయబోరని అన్నారు.