బాబూ! చెప్పులతో కొట్టిస్తే మామగారు వెళ్లిపోయారు, మేమలా కాదు: ముద్రగడ మరో లేఖాస్త్రం
రాజమండ్రి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. ఆయన శనివారంనాడు చంద్రబాబుకు లేఖ రాశారు. "ముఖ్యమంత్రిగారూ పిచ్చిపిచ్చిగా మా మీద దాడి చేయిస్తే తోక ముడిచి పారిపోతుందని అనుకుంటున్నారేమో.. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుంద"ని ఆయన అన్నారు.
"అలాగే మా జాతి తిరగబడడానికి భయపడదు. తప్పుడు పాలన మార్చుకోండి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు" అని ఆయన హెచ్చరించారు. "పిల్లనిచ్చిన మామగారిని చెప్పులతో కొట్టిస్తే పదవి వదిలి వెళ్లిపోయారు... అలాగే ఎదురు దాడులు చేయిస్తే పారిపోతారని అనుకుంటున్నారేమో ఈ కాపు కులం పారిపోయే జాతి కాదు" అని అన్నారు.

"ఇచ్చిన హామీలను తెచ్చుకునే వరకు నిద్రపోము. మా జాతి ఎవరి రక్తమో ఎక్కించుకోలేదు. ఆ అవసరం కూడా లేదు. అందుచేత పౌరుషంగా తిరుగబడుతారు" అని ఆయన అన్నారు. "మీ నుండి మీ నాయకుల వరకు తరచు సభలూ సమావేశాల్లో కాపులను బీసిల్లో చేరుస్తామని కొంగ జపాలు చేస్తున్నారు. జపాలు ఆపి హామీని ఆచరణలో పెట్టే ఆలోచన చేయండి" అని ఆయన అన్నారు.
"రాత్రులు అమ్మకు ఇల్లు కట్టిసాం, ఉదయం మరిచిపోతాం అనే సామెతను గుర్తుకు తెచ్చుకోండి. అయ్యా మీ కాకమ్మ కబుర్లు మాని కార్యాచరణ చెయ్యమని డిమాండ్ చేస్తున్నాము" అంటూ ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు సూచించారు.












Click it and Unblock the Notifications