కొత్త పార్టీ దిశగా ముద్రగడ-తక్కువ జనాభాకు అధికారమెందుకని ప్రశ్న-రూట్ మ్యాప్ వెల్లడి
ఏపీలో ప్రత్యేక రాజకీయ పార్టీ స్ధాపన దిశగా అడుగులేస్తున్న మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తక్కువ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి అధికారం ఎలా ఇస్తారని, ఎక్కువ జనాభా అధికారానికి దూరంగా ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బీసీ, కాపు, దళిత సోదరులకు రాస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.
ఇందులో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదంటూ ముద్రగడ పేర్కొన్నారు. తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలని ఇందులో ముద్రగడ ప్రశ్నించారు. ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచన మన జాతుల వారు ఆలోచనచేయాలన్నారు. మన జాతులు జీవితాలు పల్లకీలు మోయడానికేనా... ఎన్నటికీ పల్లకిలో కూర్చునే అవకాశం తెచ్చుకోలేమా అని ముద్రగడ ప్రశ్నించారు. ఇతర గౌరవ, బీసీ, మరియు దళిత నాయకులు సహకారం తీసుకుని బ్లూ ప్రింట్ తయారు చేద్దామని ముద్రగడ ప్రతిపాదించారు.
మనం చేసే ఆలోచనలు, ఆర్బాటాలు, హడావుడి చేయకుండా చాపకింద నీరులాగా భూమి లోపల వైరింగ్ లాగా ఉండాలంటూ : ముద్రగడ దళితులు, బీసీలు, కాపులకు మరో సూచన కూడా చేశారు. ఇది రాజ్యాంగం కోసం చేసే విప్లవం, శాశ్వత రాజ్యం కోసం అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. మనం ఎవరికీ వ్యతిరేకం కాదంటూ, ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేట్ జాగీరు కాదంటూ ముద్రగడ సంచలన కామెంట్స్ కూడా చేశారు. దీంతో ముద్రగడ అడుగులు ఎటు అన్నది తేలిపోతోంది. భవిష్యత్తులు కాపులు, బీసీలు, దళితుల్ని కలుపుకుని కొత్త రాజకీయ పార్టీ దిశగా ముద్రగడ పనిచేయబోతున్నారనేది ఈ వ్యాఖ్యలతో అర్ధమవుతోంది.