చంద్రబాబుకు ముద్రగడ డెడ్ లైన్: ఆలోగా స్పందించకపోతే మరో ఉద్యమమే!
ఎన్నికల హామిలను నిలబెట్టుకోని వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ఈ విషయం గుర్తెరిగి వ్యవహరించాలన్నారు.
అమరావతి: కాపులకు రిజర్వేషన్ అంశంపై ఇప్పటికే ఓ దఫా ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరో పోరుకు సన్నద్దం అవుతున్నారు. మే 7వ తేదీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ఆయన.. ఆలోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మే 7వ తేదీన సీఎం చంద్రబాబు నుంచి గనుక ప్రకటన రాకపోతే.. అదే రోజు కాపు జేఏసీ నేతలతో సమాలోచన జరిపి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ముద్రగడ అన్నారు. ఒకవేళ కాపు రిజర్వేషన్లపై సీఎం నుంచి చర్చలకు ఆహ్వానం లభిస్తే... తమ తరుపున ఐదుగురిని చర్చలకు పంపుతామని అన్నారు.
తన అనుభవాన్నంతా ఉపయోగించి మరీ చంద్రబాబు ఉద్యమాన్ని అణచివేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కాపు సోదరులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. అదే సమయంలో ఇటీవల సుప్రీం కోర్టు చేసిన ప్రకటనను ముద్రగడ గుర్తుచేశారు.