కాపులు మరోసారి మీ విజయం కోసం - సీఎం జగన్ కు ముద్రగడ లేఖ..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు లేఖ రాసారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. తాజాగా పార్లమెంట్ వేదికగా కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఇచ్చిన స్పష్టతను ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ పై ఇచ్చిన తీర్పును గుర్తు చేసారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు అనుసరించి ఆర్టికల్ 342 A (3) ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం పై దృష్టి పెట్టాలని కోరారు.
రిజర్వేషన్లపై పరిశీలన చేయాలని ముద్రగడ పేర్కొన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలంటూ లేఖలో కోరారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపుకు కృషి చేశారంటూ సీఎంకు వివరించారు. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని ముద్రగడ సూచించారు. మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలని కోరారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ ల ను ప్రజలు దేవుళ్ళు లా భావించారన్నారు. పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలని ముద్రగడ సూచించారు. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలన్నారు.
తన జాతి కోసం తపన తప్ప సీఎంను ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు లేదని ముద్రగడ లేఖలో వివరించారు. ఇప్పటికే తాజాగా మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య సీఎం జగన్ కు లేఖ రాసారు. కాపులకు ఆమోదయోగ్యమైన ఉత్తర్వులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేసారు. నాడు చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు అయిదు శాతం ఇవ్వటానికి ప్రయత్నించిన సంగతి గుర్తు చేసారు. ప్రభుత్వ నిర్ణయానికి డెడ్ లైన్ విధించారు. లేకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. దీంతో, ఇప్పుడు సీఎం జగన్ ఈ వరుస లేఖల నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.