నా శవాన్నే తీసుకెళ్లండి: ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆమరణ దీక్షలోనే ముద్రగడ
తూర్పుగోదావరి: కాపు రిజర్వేషన్లు, తుని ఘటన కేసులో అరెస్టయిన వారిని విడుదల చేయాలంటూ 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మరింతగా క్షీణిస్తోంది. కుటుంబసభ్యులు, బంధువులు దీక్ష విరమించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన వినిపించుకోవడం లేదు.
ఈ క్రమంలో 'రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి వైద్య మెందుకు? ఇవన్నీ అవసరమా? నన్ను వేరెక్కడికీ తీసుకెళ్లొద్దు. తీసుకు వెళ్లాలనుకుంటే నా శవాన్నే బయటకు తీసుకువెళ్లండి' అంటూ రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం వైద్యులు, బంధువుల వద్ద నిర్వేదం వ్యక్తం చేశారు.

ఆరోగ్య పరీక్షలకు, రక్త నమూనాలు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. ముద్రగడకు 101 డిగ్రీల జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది. గుండె సంబంధిత సమస్య తలె త్తడంతో వైద్యులు కలవరపడుతున్నట్టు సమాచారం. తుని ఘటనలో అరెస్ట్ అయిన 13 మందిలో మిగిలిన ముగ్గురు బయటకు రావడంలో జరుగుతున్న జాప్యం వల్ల ముద్రగడ వైద్యం చేయించుకోడానికి నిరాకరిస్తున్నారు.
ముద్రగడను చూసేందుకు వెళ్లిన చల్లా సత్యనారాయణ సహా ముగ్గురు సన్నిహితులు బయటకు వచ్చాక ఆయన ఆరోగ్యంపై తీవ్రంగా కలతచెందారు. ఆదివారం రాత్రి 7గంటల నుంచి వైద్యులు, బందోబస్తులో ఉన్న పోలీసులు సైతం కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ముద్రగడ ఆరోగ్యం మరింత క్షీణించిందని, ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు కుటుంబసభ్యులను అడగడంతో వారు కూడా ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. కాగా, ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టాలని కుటుంబసభ్యులు, కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications