బాబు చెప్పే అబద్ధాలు నమ్ముతారా?: పవన్కు ముద్రగడ బహిరంగ లేఖ ఇదే
కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు బహిరంగలేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ప్రయాణించి పరపతి తగ్గించుకోవద్దని సూచించారు.
అమరావతి/తూర్పుగోదావరి: కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు బహిరంగలేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ప్రయాణించి పరపతి తగ్గించుకోవద్దని సూచించారు. అంతేగాక, చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దని కోరారు.
ముద్రగడ రాసిన లేఖ ఇలావుంది.. '31-07-2017న తమరికి, మా జాతికి(బలిజ, తెలగ, ఒంటరి, కాపు) అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 25-08-1994న ఇచ్చిన జి.ఓ నెం. 30ని గౌరవ హైకోర్టు ఫుల్ బెంచ్లో కొట్టి వేసినట్లు, బి.సి. రిజర్వేషన్లు జి.ఒ ఇవ్వమని ఉద్యమకారులు తొందర చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు మీవద్ద ఆవేదన చెందినట్లుగా వారి పెంపుడు పత్రికలో ఈ రోజు వ్రాయడం జరిగింది' అని పేర్కొన్నారు ముద్రగడ.
'ఏడు మాసాల్లో బీసీ కమీషన్ నివేదిక తెప్పించి రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గత సంవత్సరం ఫిబ్రవరిలో హామి ఇచ్చారు. కమిషన్ వేసి 18నెలలు గడిచింది. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. అయినా ఇప్పటి వరకు హామీని నెరవేర్చలేదు. మేము అడిగితే ఏడు మాసాలు ఆగలేరా? అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.
అరువు రేపు అన్నట్లుగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడానికి సిగ్గు పడటం లేదు. వారి మాటలు వినడానికి మా జాతి మొత్తం విపరీతంగా సిగ్గుపడుతోంది. వారు ఇచ్చిన హామీలు నీటిమీద రాతలని తెలుసుకోండి. చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మి మీరు వారితో ప్రయాణించి మీ పరపతిని తగ్గించుకోవద్దు' అని పవన్ కళ్యాణ్కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.