'సింగపూర్ పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర, పవన్ కళ్యాణ్-జగన్లు ఒక్కటి కావాలి.. నేనూ రెడీ!'
Recommended Video
అమరావతి: రాజకీయ పార్టీలకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఎందరో త్యాగాలతో మనకు విదేశీ పాలన పోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఏపీని సింగపూర్ పాలిత ప్రాంతంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సింగపూర్ కంపెనీలకు ఇస్తానని ప్రకటించిన జూన్ 7వ తేదీ ఏపీకి బ్లాక్ డే అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తమ పాదయాత్రలకు కొంత విరామం ఇవ్వాలని ఆయన హితవు పలికారు. చంద్రబాబు పాలనపై అన్ని పార్టీలు ఒకే వేదిక పైకి రావాలని చెప్పారు.
ప్రజల ఆస్తులను సొంత ఆస్తులుగా భావిస్తున్న చంద్రబాబు
ఈ సందర్భంగా ముద్రగడ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజల ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత ఆస్తులుగా భావించి, సింగపూర్ కంపెనీలకు దానం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు జీవితంలో నిత్యం కష్టాలే ఉంటాయని, రైతుల పట్ల సానుభూతి చూపాల్సిన ప్రభుత్వమే వారిని కష్టాలపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల కోసం ఒక్కతాటి పైకి రావాలి
ప్రజల కోసం అన్ని పార్టీల నేతలతో ఒకే వేదిక పైకి జగన్, పవన్ సమావేశం ఏర్పాటు చేయాలని ముద్రగడ కోరారు. రాష్ట్రాన్ని సింగపూర్ పాలిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందరూ కలిసి రాష్ట్రాన్ని, రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరముందని హితవు పలికారు.
సింగపూర్ పాలన నుంచి బయటపడేందుకు సమయం
ముఖ్యమంత్రి తన తండ్రి, తాతల ఆస్తులు అయినట్టు భావించి రైతుల భూములను దానం చేస్తున్నారని, ఇలా భూములను ధారాదత్తం చేసిన జూన్ 7ను చరిత్రలో చీకటి రోజుగా భావించాలన్నారు.సింగపూర్ పాలన నుంచి బయటపడేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
మీరిద్దరు వచ్చి చర్చించాలి
బ్రిటీష్ వారిని మన దేశం నుండి ఎలా తరిమికొట్టామో అలాగే సింగపూర్ కంపెనీని తరిమి కొట్టాలని ముద్రగడ లేఖలో కోరారు. వామపక్షలను కలుపుకుని పోరాటం చేస్తే అందులో పాల్గొనేందుకు తనలాంటి వాళ్లు ఎందరో సిధ్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్, పవన్ అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఈ విషయమై చర్చించాలన్నారు.