'ఎన్టీఆర్ పిల్లనివ్వకపోతే ఎక్కడ ఉండేవాడివో!, నీముందు రాజ్ కపూర్ కూడా పనికిరాడు'
కిర్లంపూడి: దివంగత ఎన్టీఆర్ గనుక చంద్రబాబుకు తన కూతురునిచ్చి పెళ్లి చేసి ఉండకపోతే.. ఈపాటికి ఆయన ఎక్కడ ఉండేవారో అని విమర్శించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు.
అప్పట్లో సీఎం సీటు కోసం చంద్రబాబు ఎన్టీఆర్ మీద చెప్పుల దండలు వేయించాకరి, ఈరోజేమో ఆయన విగ్రహానికి చెప్పులు విడిచి వంగి వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు నటన ముందు రాజ్ కపూర్ లాంటి స్టార్లు కూడా పనికిరారని, వాళ్లు నటిస్తే.. బాబు జీవిస్తాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నిర్వాకానికి అవమానభారంతో క్షోభ అనుభవించి ఎన్టీఆర్ మరణించారని పేర్కొన్నారు.
అందిన కాడికి దోచుకుతిని వృద్ధ నారీ పతివ్రతలాగా కబుర్లు చెప్పడంలో బాబుకు ఎవరూ పోటీ లేరని ముద్రగడ విమర్శించారు. బీజేపీతో పొత్తు తప్పిదమని చెబుతున్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని 2014లో కలిసి పోటీ చేశారని ప్రశ్నించారు. హామిల గురించి అడిగితే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు కేవలం కేసుల భయంతోనే తనను కాపాడాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగం గెలిచిందన్న బాబు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం నైతికత కాదన్నది రాజ్యాంగానికి విరుద్దం కాదా? అని ప్రశ్నించారు. బాబు వల్ల రాష్ట్ర సర్వ నాశనమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిన్న మొన్నటిదాకా ఒంటికాలుపై లేచిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీకి ఓటేయమని అడగడం హైటెక్ వ్యభిచారం కిందకు రాదా? అని నిలదీశారు.
చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలు.. అందులో సొల్లు, సోది వినలేక ప్రజలు ఆయన సభలకు రావడం మానేశారని అన్నారు. ఉపాధి హామి కూలీలకు డబ్బులిచ్చి మరీ సభలకు తరలిస్తున్నారని ఆరోపించారు. అలా చేయడానికి సిగ్గులేదా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దయతో బతకాలని, అంతే తప్ప నేనే గొప్పోడినని విర్రవీగవద్దని హెచ్చరించారు. తనకు నచ్చనివారిపై చెప్పులు, రాళ్లదాడి చేయించడం చంద్రబాబు మానుకోవాలన్నారు.