రావణుడి అన్న పాలన: బాబుపై ముద్రగడ, హౌస్ అరెస్ట్, పాదయాత్ర వాయిదా
కిర్లంపూడి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలన రావణాసురుడి అన్న పాలనలా ఉందని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. తనను 48 గంటల పాటు హౌస్ అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారన్నారు.
తనకు స్వేచ్ఛ కల్పించిన మరుక్షణమే పాదయాత్ర చేస్తానని చెప్పారు. రక్షణ కల్పించి పాదయాత్రకు అనుమతించాలని హైకోర్టు చెప్పినా హౌస్ అరెస్టు చేయడం విడ్డూరమన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉద్యమం ఆగదని ముద్రగడ చెప్పారు.
తనను గృహ నిర్భందం చేసినందువల్ల తన పాదయాత్ర తాత్కాలిక వాయిదా వేస్తున్నానని చెప్పారు. 48గంటల తర్వాత పోలీసులు ఏం చెబుతారో చూడాన్నారు.

కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో రేపు ఉదయం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు ముద్రగడ సిద్ధమయ్యారు. అరాచక శక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని, పోలీసులు ఆయన్ను కిర్లంపూడిలో గృహనిర్భందంలో ఉంచారు.
అంతకుముందు, ముద్రగడ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆయన యాత్రలో అరాచకశక్తులు పాల్గొనే అవకాశముందని భావించి ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆయనను ఇంటి లోపలకు తీసుకెళ్లారు. హౌస్ అరెస్ట్ చేస్తున్నారా అని పోలీసులను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముద్రగడ అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, కాపులకు చంద్రబాబు చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్నట్లు ముద్రగడ అక్టోబర్ 14వ తేదీన ప్రకటించారు. రావులపాలెం నుంచి ప్రారంభించి అంతర్వేదిలో ముగిస్తానని చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా యాత్రను అడ్డుకోవాలనుకున్నా, మంగళవారం ముద్రగడకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి.












Click it and Unblock the Notifications