సమ్మక్క సారక్క యూనివర్సిటీ పనుల్లో బయటపడిన పురాతన ఆలయం.. పాములు; మొరాయించిన జేసీబీ!
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీకి ప్రహరీ గోడలు నిర్మించడానికి జేసీబీతో కందకాలు తవ్వుతుండగా పురాతన ఆలయానికి చెందిన శిలలు బయటపడ్డాయి. అంతేకాకుండా ఆ శిలల మధ్య నుంచి భారీ నాగు పాములు బయటకు రావటంతో అక్కడి కార్మికులు, అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
యూనివర్సిటీ నిర్మాణంలో ఆపరేటర్కు పురాతన కాలం నాటి శిలలు
యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణం కోసం జేసీబీతో తవ్వకాలు జరుగుతుండగా, ఆపరేటర్కు పురాతన కాలం నాటి శిలలు కనిపించాయి. మొదట్లో సాధారణ రాళ్లని భావించి తొలగించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ శిలల ఆకృతి చూసి అవి పురాతన ఆలయ నిర్మాణానికి ఉపయోగించినవని అర్థమైంది. జేసీబీతో ఆ రాళ్లను కదిపిన వెంటనే మూడు అతి పెద్ద నాగు పాములు ఒకేసారి బయటకు వచ్చాయి.

మూడు పాములు బుసలు కొడుతూ బయటకు , మొరాయించిన జేసీబీ
పాములు బుసలు కొడుతూ బయటకు రావడంతో అక్కడి వారంతా షాక్కు గురయ్యారు. ఒక పాము మీద మట్టి, రాళ్లు పడడంతో అది చనిపోయింది. ఈ దృశ్యం చూసి జేసీబీ ఆపరేటర్ భయంతో వాహనాన్ని అక్కడే వదిలేసి పరుగెత్తాడు. ఆ తర్వాత జేసీబీ కూడా పని చేయకుండా మొరాయించడంతో కార్మికులంతా ఆందోళన చెందారు.
స్థానికంగా చర్చ, పనుల తాత్కాలిక నిలిపివేత
బయటపడిన శిలల ఆకృతి, నాణ్యత చూసి స్థానికులు ఇవి కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయ అవశేషాలు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారులు వెంటనే స్పందించి యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. పురాతన ఆలయ అవశేషాలను ఆర్కియాలజీ శాఖ అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
లోపల పురాతన ఆలయం ఉందా? చర్చ
ఈ ఘటన సమ్మక్క సారక్క యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో ఆసక్తికరంగానే కాదు నిర్మాణ పనులకు అవరోధంగా మారింది. ఒకవైపు ఆధునిక విద్యా సంస్థ నిర్మాణం, మరోవైపు పురాతన చారిత్రక ఆనవాళ్లు బయటపడడం స్థానికుల్లో ఈ నిర్మాణం పూర్తవుతుందా? లోపల ఏమైనా పురాతన ఆలయం ఉందా? ఒకవేళ ఉంటే అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది.













Click it and Unblock the Notifications