ముద్రగడ దీక్ష: జగన్ను ఏకిపారేస్తున్న తెలుగు తమ్ముళ్లు
విజయవాడ: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో తెలుగు తమ్ముళ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ముద్రగడ చేత జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు ఏకిపారేస్తున్నారు.
కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నప్పటి నుంచి కూడా ఇదే పంథాలో వారి వ్యాఖ్యలు ఇదే పంథాలో సాగుతున్నాయి. ముద్రగడ ఆందోళన వెనక జగన్ ఉన్నాడనేది వారి ప్రధాన ఆరోపణ. ఒక రకంగా ముద్రగడ దీక్ష ప్రభావాన్ని వారు తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. తాజాగా శనివారంనాడు కూడా మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు కొంత మంది జగన్పై విమర్సలు చేశారు.
జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని బీసీ సంక్షేమ ఉపకులాల సంఘం నేతలు కలిశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల సంచారజాతుల కలను సీఎం నెరవేర్చారని చెప్పారు. రిజర్వేషన్లపై అభ్యంతరాలుంటే బీసీ కమిషన్ను కలవాలని కొల్లు రవీంద్ర సూచించారు.
తుని ఘటనలో చట్టం తన పని తాను చేస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ పని అని, అధికారంలోకి రావడం కోసం కాపులను వాడుకుంటున్నారని ఆయన శనివారం మీడియా మసావేశంలో విమర్శించారు.
కాపు సోదరులు సంయమనం పాటించాలని, తొలినుంచి కాపులను టీడీపీయే గుర్తించిందని, ముద్రగడ కోరితే తుని ఘటనను సీబీఐతో విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. జగన్ పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని జగన్ మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని కళా వెంకట్రావు అన్నారు.
ప్రతిపక్ష నేత జగన్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోండా ఉమ ఆరోపించారు. వారు ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారన్నారు. కాపుల సమస్యలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్, వైసీపీకి లేదని ఆయన శనివారంనాడు మండిపడ్డారు.
శుక్రవారంనాడు కూడా మంత్రులు నారాయణ, చినరాజప్ప జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ చేత జగనే ఆందోళన చేయిస్తున్నారనే అర్థం వచ్చేలా వాళ్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి భావన కూడా అదే విధంగా ఉన్నట్లు అర్థమవుతోంది.