నాకు ఫోన్లు వస్తున్నాయి.. తేల్చుకుందాం, చంద్రబాబు వల్లే: కాపు గర్జనలో ముద్రగడ
తుని: కాపు రిజర్వేషన్ల పైన ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, ఇక అటో ఇటో తేల్చుకుందామని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జన మధ్యాహ్నం ప్రారంభమైంది.
ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాపు గర్జనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ జాతి ఎంతో నష్టపోతోందని, ఈ ఉద్యమాన్ని ఆపవద్దంటూ తనకు ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారని ముద్రగడ చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యల ద్వారా అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోను అమలు చేయాలని, కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలంలో కాపు, బలిజ, తెలగ కులస్తులు రిజర్వేషన్లు అనుభవించారన్నారు.
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నంబరు 30 అమలు కాలేదన్నారు. చంద్రబాబు మాత్రం దీనిపై హైకోర్టులో పిటిషన్ వేయించి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నారని, దీనివల్ల ఆ జీవో అమల్లోకి రాకుండా పోయిందన్నారు.
కాపులకు ఎంతో చేశానని చంద్రబాబు చెబుతున్నాడని, మరి కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కోర్టులో పిటిషన్ వేసి ఎందుకు అడ్డుకున్నారన్నారు. కాపుల రిజర్వేషన్ కోసం ఏమి చేశావంటే బాబు తనను ప్రశ్నిస్తున్నారని, తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా ఉద్యమం చేశానన్నారు. జీవో నంబరు 30 వచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని, అటో ఇటో తేల్చుకుందామన్నారు.