మాట నిలబెట్టుకుంటారా? మళ్లీ రోడ్డెక్కమంటారా? : బాబుకు ముద్రగడ హెచ్చరిక
కడప : కాపు రిజర్వేషన్లకు సంబంధించి వీలైనంత త్వరగా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకపోతే.. మరోసారి ఆందోళనలతో రోడ్డెక్కడం ఖాయమంటున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. హామిలు నెరవేరుస్తారా.. మళ్లీ రోడ్డెక్కమంటారా.. అని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు ముద్రగడ.
మంగళవారం నాడు కడప జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరవడంతో పాటు.. దేవుడి కడపలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా.. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు ఇప్పటికైనా తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసిన ముద్రగడ.. రిజర్వేషన్ల పరిశీలన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటిదాకా ఒక్క గ్రామంలోను పర్యటించలేదన్నారు.
సెప్టెంబర్ మొదటి వారం నాటికి ప్రభుత్వం ఇచ్చిన గడువుతో పాటు, మంత్రివర్గ ఉపసంఘం గడువు కూడా పూర్తవుతుందని గుర్తు చేసిన ముద్రగడ.. ఆలోగా విషయాన్ని తేల్చకపోతే జేఏసీతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతామని ప్రకటించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్దాలు ఆడడం సరికాదన్న ముద్రగడ.. తుని ఘటనలో చంద్రబాబు చాలామందిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.