తీవ్ర ఉద్రిక్తత, ముద్రగడను హౌస్ అరెస్ట్ చేస్తారా: వట్టి, చేయాల్సింది చేశా: బొత్స
రాజమహేంద్రవరం: కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ సతీమణితో పాటు నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున కాపు నేతలు తరలి వస్తున్నారు.
అయితే, పోలీసులు ఆయన ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. దీంతో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పోలీసుల ఆంక్షల పైన మండిపడ్డారు. జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వట్టి వసంత్ కుమార్ మాట్లాడుతూ.. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడం సరికాదన్నారు. ముద్రగడ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించడం చేస్తూంటే ఆయనను హౌస్ అరెస్టు చేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు.
దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి ఎవరూ తూర్పు గోదావరి జిల్లాకు రావొద్దని పోలీసులు నిషేదాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. ముద్రగడ దంపతుల ఆమరణ దీక్షఖ నేపథ్యంలో తూగో జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
నేను చేయాల్సిందంతా చేశా: బొత్స
గతంలో కాపుల రిజర్వేషన్ల కోసం తాను చేయాల్సిందంతా చేశానని వైసిపి నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం వల్లనే కాపు ఉద్యమం ఉద్యమ రూపు దాల్చుతోందన్నారు. ముద్రగడ దీక్ష చేయవద్దని తాను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం: అంబటి
ప్రభుత్వం బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ సరికాదన్నారు. కేసుల పేరుతో కాపులను బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు. ముద్రగడ శాంతిని కాంక్షించే వ్యక్తి అని గత చరిత్ర చూసినా తెలుస్తుందన్నారు. ఇతర కులాల సమావేశాలకు కేబినెట్ మంత్రులు వెళ్లవచ్చు కానీ, కాపు సమావేశాలకు కాపులు వెళ్లవద్దా అని ప్రశ్నించారు.
చవకబారు ఎత్తుగడలతో కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం సరికాదన్నారు. తూగో జిల్లాలో వందలమంది పోలీసులను ఎందుకు మోహరించారని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయవద్దన్నారు.
చవకబారు రాజకీయాలతో సమస్యను జఠిలం చేయవద్దన్నారు. తక్షణమే ముద్రగడతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. మూడు మాసాల్లో కమిషన్ నివేదిక, కాపు కార్పోరేషన్కు రూ.2వేల కోట్లు ఇస్తామని ప్రకటించాలన్నారు. టిడిపిలో ఉన్న కాపు నాయకుల సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపాలన్నారు. ముద్రగడ దీక్షకు తాము భేషరతుగా మద్దతిస్తున్నామన్నారు.