రాజధానికి ముహూర్తం ఖరారు, అది వద్దని హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. జూన్ ఆరవ తేదీన కొత్త రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం జూన్ 6వ తేదీన ఉదయం 8.49 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూజ చేయనున్నారు.
జ్యోతిష్యులతో సంప్రదించిన అనంతరం ఈ ముహూర్తాన్ని ఖరారు చేశారు. మరోవైపు, జూన్ 8 నాటికి చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టీడీపీ భావిస్తోంది.
ముహూర్తం సరైంది కాదు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్ణయించిన ముహూర్తాం సరైంది కాదని ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీనివాస గార్గేయ అన్నారని తెలుస్తోంది. పుష్కరాలకు నలభై రోజుల ముందు ముహూర్తాలు వాస్తుపరంగా మంచి ఫలితాలు ఇవ్వవనిచెప్పారు.
పుష్కరాలు ఆరంభమైన 70 రోజుల తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటే మంచిదన్నారు. జూన్ 6వ తేదీన రాజధానికి ముహూర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్కరాలకు ముందు జూన్ 6వ తేదీన ముహూర్తం వాస్తు ప్రకారం లాభదాయకంగా లేదని, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు.