ములుగు అసెంబ్లీ సీటు: వ్యక్తిగత బలంపైనే సీతక్క
2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచిన ఆమె 41,107ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. అయితే 2009 ఎన్నికల్లో మహాకూటమి బలంతో విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆమె తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకున్నారు. కంతనపల్లి ప్రాజెక్టు సాధన, దేవాదుల నీటి మళ్లింపుకోసం పాదయాత్రలు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రభుత్వంపై ఉద్యమించారు. 2009లో 6 రోజులు ఆమరణ నిరాహరదీక్ష చేసి తాను తెలంగాణ కోసం నిలబడినట్లు చాటుకున్నారు.
వ్యక్తిగత బలం, పార్టీ సాంప్రదాయ ఓట్లతోపాటు తెలంగాణవాదుల ఓట్లను, బిజెపి ఓట్లను కూడా పొంది విజయం సాధించాలని ఆరాటపడుతున్నారు. కానీ, గత ఎన్నికల తర్వాత పలు మండలాల్లో బలమైన ప్రథమశ్రేణి నాయకులు పార్టీని వీడడం సీతక్కకు ప్రతికూలంగా మారింది.
తెలంగాణను ఇచ్చింది.. తెచ్చింది మేమేనని, ఓట్లడిగే హక్కు మాకే ఉందంటూ కాంగ్రెసు నాయకులు ప్రచారం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వీరయ్య ఇదే నియోజకవర్గం నుంచి 1999, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో మాత్రం సీతక్క చేతిలో పరాజయం పాలయ్యారు. అయినా 45 వేలకు పైగా ఓట్లను తెచ్చుకుని తన పట్టు నిలుపుకొన్నారు. వ్యక్తిగత ఓటు బ్యాంకుతోపాటు తెలంగాణ కలను కాంగ్రెస్ సాకారం చేయడం వీరయ్యకు సానుకూలాంశాలు.
పార్టీ ఆవిర్భావం తర్వాత రెండు ఎన్నికలు జరిగినా ఈ నియోజవర్గంలో ఇప్పటి వరకు తెరాస తన అభ్యర్థిని నిలబెట్టలేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకొని ఆపార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యకు, 2009లో మహాకూటమిలో భాగస్వామ్యపక్షంగా ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతక్కకు మద్దతిచ్చింది. ఈసారి మాత్రం తెరాస ఎన్నికల బరిలో దూకుతోంది.
తెరాస తరఫున అజ్మీరా చందూలాల్ను రంగంలోకి దిగారు. ఆయన ములుగుకు మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఓ పర్యాయం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. అయితే గత 15ఏళ్ల కాలంగా ఆయన ములుగులో ప్రాబల్యం కోల్పోయారు. ఈసారి తెలంగాణ రాష్ట్రసాధనలో తెరాస పాత్ర, గతంలో తాను చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి బాటలు వేస్తాయని ఆయన భావిస్తున్నారు.