తల్లి మునిసిపల్ ఛైర్మన్, పెత్తనం కొడుకుది, టీడీపీ చేతికి అస్త్రం, చంద్రబాబుకు ఫోన్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 55 రోజులు దాటిపోయింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మునిసిపాలిటీలు, పంచాయితీలు, గ్రామ పంచాయితీలు, జడ్పీటీసీ ఎన్నికలు సక్రమంగా జరగలేదని, వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులను బెదిరించి పలు చోట్ల ఎన్నికలే జరగనివ్వకుండా ఏకగ్రీవం అంటూ అధికారం మొత్తం వాళ్లదే అయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలోని మడకశిర మునిసిపాలిటీ ఎన్నికలు నామమాత్రంగానే జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. తరువాత మడకశిర మునిసిపల్ ఛైర్మన్ గా లక్ష్మీనరసమ్మ ఎన్నిక అయ్యారు. అయితే లక్ష్మీనరసమ్మ పేరుకు మాత్రమే మడకశిర మునిసిపల్ ఛైర్మన్ అయ్యారు. అధికారం మొత్తం లక్ష్మీనరసమ్మ కుమారుడు జయరాజ్ చేతిలోకి వెళ్లింది.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం మడకశిర మునిసిపాల్ ఛైర్మన్ లక్ష్మీనరసమ్మ కుమారుడు జయరాజ్ చక్రం తిప్పాడు. మునిసిపల్ ఛైర్మన్ కు కేటాయించిన కుర్చీలో కుర్చుని ఇంతకాలం మునిసిపల్ కమిషనర్ తో పాటు ఉద్యోగులకు హుకుం జారీ చేస్తూ పెత్తనం చెలాయించాడు. మునిసిపల్ ఛైర్మన్ లక్ష్మీనరసమ్మ కుమారుడు కావడంతో మునిసిపల్ శాఖ అధికారులు, ఉద్యోగులు కూడా జయరాజ్ ను చూసిచూడనట్లు వదిలేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కూలిపోయి గత నెలలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జయరాజ్ లో మాత్రం మార్పురాలేదు. తల్లి అధికారం అడ్డం పెట్టుకున్న జయరాజ్ ఎప్పటిలాగే ఇప్పుడు మునిసిపల్ కార్యాలయంలోని ఛైర్మన్ చాంబర్ కు రావడం, ఛైర్మన్ సీటులో కుర్చుని అధికారులు, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్ల మీద పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఇంత జరుగుతున్నా ఉద్యుగులు మాత్రం ప్రభుత్వానికి కాని, జిల్లా ఇన్ చార్జ్ మంత్రికి కాని జయరాజ్ గురించి సమాచారం ఇవ్వడం లేదని, మునిసిపల్ ఛైర్మన్ లక్ష్మీనరసమ్మ కుమారుడు జయరాజ్ ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యలేదని మడకశిర ప్రజలు ఆరోపిస్తున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ కు సమాచారం ఇచ్చి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చెయ్యాలని మనవి చేస్తామని మడకశిర టీడీపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications