జగన్కి 'మున్సిపల్' షాక్, అదీ టిడిపికే అనుకూలమా?
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో.. ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలుగుదేశం పార్టీ గట్టి షాక్ ఇవ్వగా, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెసు పార్టీ ధీటుగా నిలిచింది. తెలంగాణలో తెరాస హవా, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా ఉంటుందని అందరు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది! సీమాంధ్ర ప్రాంతంలో వైయస్ జగన్కు తిరుగు లేదని తొలి నుండి ఆ పార్టీ చెబుతోంది.
మున్సిపల్ ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. సీమాంధ్రలో టిడిపి హవా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉంది. ఇక కాంగ్రెసు పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆంధ్రా జిల్లాల్లో టిడిపి స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. కేవలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం చూపుతోంది.
వైయస్ జగన్ సొంత జిల్లా కడపలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కనిపిస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో టిడిపి గట్టి పోటీనిస్తోంది. జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలుల్లో టిడిపి ముందంజలో ఉంది. పదకొండు గంటల వరకు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖాతా తెరువలేదు.

మున్సిపల్ ఎన్నికలు టిడిపి తమ్ముళ్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోను ఇవే ఫలితాలు వస్తాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల కంటే అసెంబ్లీ, లోకసభ పోలింగ్ ఈసారి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ పోలింగ్ తమకు అనుకూలమంటే తమకు అనుకూలమని జగన్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతూ వస్తోంది. ఇప్పుడు మున్సిపల్ ఫలితాల తర్వాత తెలుగు తమ్ముళ్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ పెరుగుదల తమకే అనుకూలమని మరింత ధీమాగా చెబుతున్నారు.
ఇక తెలంగాణలో... కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తెరాస వైపే ప్రజలు మొగ్గు చూపుతారని అందరు భావించారు. కాని ఫలితాలు మాత్రం అలా కనిపించలేదు. తెరాస, కాంగ్రెసుల మధ్య పోటా పోటీ ఉన్నప్పటికీ.. కాంగ్రెసు పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. అయితే, మున్సిపల్ ఎన్నికలకు, సార్వత్రిక ఫలితాలకు తేడా ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications