ప్రభుత్వ తీరుకు నిరసనగా...దున్నపోతుకు వినతి పత్రం సమర్పించిన మున్సిపల్ కార్మికులు
కడప:రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల పరిధిలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మకులు తమ నిరసనను ఒక్కోచోట ఒక్కో విధంగా తమ నిరసనను తెలియచేస్తున్నారు. అయితే కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ కార్మికులు తమ నిరసనను వినూత్నంగా తెలిపారు.
ఇదే క్రమంలో 9 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న మైదుకూరు మున్సిపల్ కార్మికులు శుక్రవారం తమ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పట్టణం లోని రాయల్ సర్కిల్లో దున్నపోతుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తోందని, ఇప్పటికైనా స్పందించి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.
279 జివో ను రద్దు చేయాలని, 5 సంవత్సరాల విధి నిర్వహణను పూర్తి చేసుకున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ కార్మికులకు పిఎఫ్ సౌకర్యం కలిగించాలని తదిదర డిమాండ్లతో మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు విజయ కుమార్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల దున్నపోతులా ఉలుకూ పలుకూ లేకుండా ఉందన్నారు.
పట్టణాలను శుభ్రం చేసే కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెను నిర్వీర్యం చేయడానికి కార్మికుల పట్ల బెదిరింపు ధోరణి అవలంబిస్తోందని, చర్చలు జరపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా సమ్మెను విచ్చిన్నం చేయడానికి చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరును అడ్డుకుంటామని, ఈ నెల 15వ తేదీ నుంచి అత్యవసర సేవలు కూడా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
అనంతరం సిఐటియు నాయకులు సుబ్బారాయుడు మాట్లాడుతూ...అట్టడుగు వర్గాలు పని చేసే మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం అంటరానివారిగా చూడడం తగదని మండిపడ్డారు. కార్పొరేటుకు ఊడిగం మాని, పేదల పక్షం నిలవాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పండుగ వేళ కార్మికుల జీవితాలలో చీకట్లు నింపడం సరికాదని హితవు పలికారు.