పవన్ కళ్యాణ్కు మురళీ మోహన్ కౌంటర్, 'రెండేళ్లలో జగన్ సిఎం, బాబు రాజీనామా'
హైదరాబాద్: తన పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ మంగళవారం నాడు స్పందించారు.
తన విషయంలో అవగాహన లేకనే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడి ఉంటారని వ్యాఖ్యానించారు. అవసరమైతే రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో తాను భూమిని కొనుగోలు చేశానన్న వార్తలు అవాస్తవమన్నారు.
భూసేకరణ పైన రాజధాని అమరావతి ప్రాంతంలో పవన్ కళ్యాణ్తో కలిసి పర్యటిస్తానని మురళీ మోహన్ చెప్పారు. రాజధాని ప్రాంతంలో తనకు అంగుళం భూమి కూడా లేదన్నారు. దివంగత వైయస్ హయాంలో ఔటర్ రింగు రోడ్డు కోసం 18 ఎకరాల తన భూమిని లాక్కున్నారని, దీనిపై తాను కోర్టుకెళ్లానని చెప్పారు.
నాడు వట్టి వసంత్ కుమార్ తన పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే సుప్రీంకు వెళ్లానని వివరణ ఇచ్చారు. రాజధాని భూముల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది వాస్తవమన్నారు. అయితే, రాజధాని, ఏపీ భవిష్యత్తు దృష్టా రైతులు భూమిని ఇవ్వాలన్నారు.

మంచినీరు కూడా ఇవ్వట్లేదు: జగన్
ఈ ప్రభుత్వం ప్రజలకు కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. విష జ్వరాల బాధితులను ఆదుకోవాలని, తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద జగన్ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కృష్ణా డెల్టాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. జ్వరాలతో ప్రజలు మరణిస్తున్నా పట్టించుకోరా అన్నారు. కొద్ది రోజుల క్రితం తాను మాజేరు గ్రామానికి వెళ్లానని, అప్పటికి ఆ గ్రామంల 18 మంది చనిపోయారన్నారు.
తాను వెళ్లిన తర్వాత.. ఆరోగ్య శాఖ మంత్రి మాజేరు వెళ్లారన్నారు. వాటర్ ట్యాంకులో పడి కోతులు చనిపోయాయని, నీరు కుళ్లిందని, కనీసం మంచినీరు కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిద్రమేల్కొని చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండాలన్నారు.
రెండేళ్లలో జగన్ సీఎం కావడం ఖాయం: ప్రతాప్
మరో రెండేళ్లలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీకి చెందిన నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఒక్క పని కూడా చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కాలం గడుపుతున్నారని, ఈ క్రమంలో చంద్రబాబును ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి తలెత్తుతోందన్నారు.
ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు గతంలో సీఎం అయినప్పుడు కరవు వచ్చిందని, ఇప్పుడు కూడా కరవు వచ్చిందన్నారు. జగన్ సీఎం అయితేనే వర్షాలు పడేలా ఉన్నాయన్నారు.
జగన్ పైన టిడిపి నేతల ఆగ్రహం
జగన్ ప్రతిసారి చంద్రబాబును నిందించడం సరికాదని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. జగన్ తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. జగన్ మొసలి కన్నీరు
కారుస్తున్నారని విమర్శించారు.
ఈ నెల 29న రాఖీ పౌర్ణమి సందర్భంగా జగన్ బంద్ పైన పునరాలోచన చేయాలని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. 29న రాఖీ పౌర్ణమితో పాుట అధికార భాషా దినోత్సవం ఉందని చెప్పారు. సామాజిక స్పృహ లేకుండా
జగన్ బందులకు పిలుపునివ్వడం విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications