ఒక పార్టీ దోచేస్తే, మరో పార్టీ చీల్చేసింది: ఎంపి మురళీమోహన్
విశాఖపట్నం: కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు మురళీమోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను ఒక పార్టీ దోచేస్తే మరో పార్టీ నిలువునా చీల్చేసిందని వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆయన అనకాపల్లిలో మీడియా మాట్లాడుతూ.. విభజనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కష్టపడి పనిచేసి తిరిగి పూర్వవైభవాన్ని సాధించే దిశగా ప్రజలంతా కసితో ఉన్నారని అన్నారు.
అడ్డదిడ్డంగా విభజన చేపట్టి నేడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి చైనా, జపాన్ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.