అమరావతిలో మురళీమోహన్ జయభేరీ ప్రాజెక్టులు
గుంటూరు: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీ మోహన్కు చెందిన జయభేరి ప్రాపర్టీస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేట్టనుంది. హైదరాబాదులోని హైటెక్ సిటీలో, హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఈ సంస్థ పలు ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం వచ్చింది.
రాజధాని ప్రాంతంలోని కుంచనపల్లి వద్ద 1.27 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఇఐఎఎ) ఇటీవల జయభేరికి క్లియరెన్స్ ఇచ్చింది. జయభేరి కుంచనపల్లి వద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే విషయంలో రాష్ట్ర ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ సిఫార్సులను ఎస్ఎఐఎఎ ఆమోదించింది.
కుంచనపల్లి అమరావతికి అతి సమీపంలో ఉంటుంది. అయితే, ల్యాండ్ పూలింగ్ ఏరియాలో ఈ గ్రామం లేదు. దీంతో మురళీమోహన్ అక్కడ తన ప్రాజెక్టులకు స్తలాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన మురళీ మోహన్ హైటెక్ సిటీలోని మాదాపూర్లో, హైదరాబాదులో పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేశారు.