‘భరోసా కాదు.. రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేయాలి’
గుంటూరు: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ చేయాల్సింది రైతు యాత్రలు కాదన్న ఆయన, పశ్చాత్తాప యాత్రలు చేస్తే బాగుంటుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్న క్రమంలో మురళీధర్ రావు పై వ్యాఖ్యలు చేశారు.
ప్రధానిగా నరేంద్ర మోడీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో బిజెపి దేశవ్యాప్తంగా జన కళ్యాణ్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులో పర్యటించిన మురళీధర్ రావు, ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

దేశంలో సుపరిపాలన బిజెపితోనే సాధ్యమవుతుందని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక ఆర్థిక వృద్ధిలో దేశం ముందడుగు వేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు పాదాలపై ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. నల్లధనం ప్రపంచ దేశాల శాంతికి ప్రమాదమని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి తమ పార్టీ అనేక విషయాల్లో సహకరించిందని తెలిపారు. దక్షిణాదిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ విస్తరణకు అగ్రనేతలు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో గతంలోనే తమ పార్టీ స్పష్టత ఇచ్చిందని చెప్పారు.












Click it and Unblock the Notifications