ఉండం, చెట్ల కిందనైనా పనిచేస్తాం: మురళీకృష్ణ
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ నుంచి గెంటివేస్తామనడం సరికాదని ఎపి ఉద్యోగుల ఫోరం ఛైర్మన్ మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. సచివాలయ ఉద్యోగుల విభజన నేపథ్యంలో జరిగిన గొడవతో గురువారం సీఎస్ మహంతిని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం నేతలు కలిసారు. అనంతరం మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యోగుల ఇష్టప్రకారం చేయాలంటే కుదరదని, దీనిపై న్యాయపోరాటం చేస్తాయని మురళీకృష్ణ స్పష్టం చేశారు. అసలు రాష్ట్రంలో 371 డీ అమల్లో ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ఢిల్లీ వెళ్ళి కేంద్రహోంశాఖను కలుస్తామని, కేంద్రం దృష్టికి తీసుకువెళతామని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తామని మురళీకృష్ణ స్పష్టం చేశారు.

ఏపీ ఉద్యోగులు ఎవరూ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదని, తెలంగాణ ఉద్యోగులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అయన అన్నారు. ఇక్కడ ఎవరి దయా దాక్షిణ్యాలపై బ్రతకవలసిన అవసరం తమకు లేదని, వాళ్ళతో తిట్లు తినాల్సిన అవసరం అంతకంటేలేదని, కొత్త రాజధాని ఏర్పాటు చేస్తే చెట్టు కింద కూర్చొని అయినా సీమాంధ్రను అభివృద్ధి చేసుకుంటామని మురళీకృష్ణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ను తెలుగుదేశం అధ్యక్షుడు, సీమాంధ్ర కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆప్షన్లు ఇస్తే సీమాంధ్ర ఉద్యోగులు అందరూ వెళ్లిపోతారని ఆయన అన్నారు. ఐదు, పదిశాతం మంది మాత్రమే ఇక్కడ ఉంటారని, తమకు ఆత్మాభిమానం ఉందని, సాధ్యమైనంత తొందరగా తీసుకుని వెళ్లాలని చంద్రబాబుకు చెప్పామని, చెట్ల కిందనైనా పనిచేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications