కారు టైర్ల బోల్టులు తీసేశారు! హత్యకు కుట్ర: పోలీసులు పట్టించుకోవట్లేదు: హర్షకుమార్ ఆందోళన
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని అన్నారు. తాను రోజూ ప్రయాణించే కారు టైర్ల బోల్టులను తొలగించారని చెప్పారు. కారు టైర్ల బోల్టులు తొలగించిన విషయాన్ని తాను ఇంటి వద్ద గుర్తించానని, ఆ వెంటనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించానని అన్నారు. తన ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో దీనికి సంబంధించిన దృశ్యాలేవీ రికార్డు కాలేదని చెప్పారు. కారు షోరూమ్ లోనే టైర్ల బోల్టులను తొలగించి ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. ఫలితంగా- ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశానని హర్షకుమార్ చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యారంగంలో కార్పొరేట్ కళాశాలలు హద్దు, అదుపు లేకుండా ఫీజులను వసూలు చేస్తున్నాయని, కొంతకాలంగా ఈ అంశంపై తాను న్యాయపోరాటం చేస్తున్నానని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తనను హత్య చేయడానికి కుట్ర జరిగి ఉండొచ్చని హర్షకుమార్ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. ఒక్కో విద్యార్థి నుంచి 2,800 రూపాయల మేర ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉందని చెప్పారు. దీనికి బదులుగా ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు వేల రూపాయల మేర ప్రోత్సహకాలను అందిస్తోందని ఆరోపించారు. ఫీజుల నియంత్రణ కోసం తాను న్యాయం పోరాటం చేస్తున్నానని అన్నారు.
పేద విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చిన ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం రూ.35వేలు ఫీజు కట్టే పథకాన్ని ప్రవేశపెడితే.. దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయిదేళ్లుగా తాను పదవి లేకపోయినప్పటికీ.. పేదలు, దళితుల కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. ప్రైవేటు కాలేజీల్లో దళిత విద్యార్థులకు న్యాయం జరగట్లేదని అన్నారు. ఏ కళాశాలలో కూడా అడ్మిషన్ షెడ్యూల్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించట్లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తనను దారుణంగా మోసం చేసిందని హర్షకుమార్ ఆరోపించారు. అమలాపురం లోక్ సభ టికెట్ ఇస్తామని ఆశచూపించి చంద్రబాబు తనను టీడీపీలో చేర్చుకున్నారని, చివరి నిమిషంలో వేరొకరికి టికెట్ ఇచ్చారని విమర్శించారు.