అమరావతిని రాజధానిగా గుర్తించడం లేదు, ఏపీలో మరో ప్రాంతీయ ఉద్యమం: మైసూరా సంచలనం
అమరావతి: అమరావతిని మేం రాజధానిగా గుర్తించడం లేదంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైసూరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఓ టీవి ఛానెల్ చర్చా గోష్టిలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నెలకొల్పడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై రాయలసీమ వాసులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. తద్వారా ఏపీలో మరో ప్రాంతీయ ఉద్యమం వచ్చే అవకాశాలున్నాయని అన్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సోమవారం రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని మల్కాపురం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మల్కాపురంలో చెరకు పంట దగ్ధమైన పొలాన్ని పరిశీలించారు.
రైతు గద్దె చంద్రశేఖర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంటను కావాలనే దగ్ధం చేశారని ఆరోపించారు. 'రైతు ఫిర్యాదు చేస్తే పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. పైగా ఎవరో కాల్చిన సిగరెట్ పడేస్తే పంట కాలిపోయిందని, దానికంత రాద్ధాంతం ఎందుకని డీఎస్పీ చులకనగా మాట్లాడటం దారుణం. ఆ డీఎస్పీ పైనా కేసు వేస్తాం' అని జగన్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడని ఈ సందర్భంగా వైయస్ జగన్ ధ్వజమెత్తారు. తాను టీడీపీకి ఓటు వేశానని, ల్యాండు పూలింగ్కు భూములు ఇవ్వనన్నందుకు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని రైతు చంద్రశేఖర్ వాపోయారు.
అండగా ఉంటానని అధైర్యపడవద్దని జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. చంద్రబాబునాయుడు పాలన ఎన్నాళ్లో సాగదని, అధికారంలోకి మనమే వస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇస్తామని ఉద్ఘాటించారు.