టిజి వెంకటేష్ మెతగ్గా, మైసురా ఘాటుగా: చంద్రబాబుకు ముందస్తు హెచ్చరికలు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలు దేన్ని సూచిస్తున్నాయనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మరో ప్రాంతీయ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తే అవకాశం ఉందని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పరోక్ష హెచ్చరికలాంటిది కూడా చేశారు.
రాయలసీమలో మెల్లగా అసంతృప్తి చోటు చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోస్తాంధ్ర ప్రాంతంలో నిర్మించడం వంటి విషయాలు ఆ అసంతృప్తికి కారణంగా మారుతున్నాయి. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తీరు పట్ల మైసురా రెడ్డి కాస్తా ఘాటుగా వ్యాఖ్యానించగా, మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు టిజి వెంకటేష్ కాస్తా మెతగ్గానే అయినా కచ్చితంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వీరిద్దరి వ్యాఖ్యలు కూడా చంద్రబాబుకు ముందస్తు హెచ్చరికల్లాంటివని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అమరావతిని మేం రాజధానిగా గుర్తించడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైసూరా రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఆయన ఓ టీవి ఛానెల్ చర్చా గోష్టిలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నెలకొల్పడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై రాయలసీమ వాసులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. తద్వారా ఏపీలో మరో ప్రాంతీయ ఉద్యమం వచ్చే అవకాశాలున్నాయని అన్నారు.
ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయని టిజి వెంకటేష్ సోమవారంనాడు అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల కంటే సీమ, ఉత్తరాంధ్రలు ఎక్కువగా వెనుకబడి ఉన్నాయని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో ఎండాకాలం రాజధాని (సమ్మర్ కేపిటల్) ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఎదుట డిమాండ్ పెట్టారు. అంతేకాకుండా, రాజధాని అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని చెప్పారు.
మరోవైపు, రాయలసీమ పరిరక్షమ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురువుతోందనే అభిప్రాయం బలపడుతూ పోతుంటే చంద్రబాబు ప్రభుత్వం చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ప్రస్తుత మనోభావాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదేనని అంటున్నారు.