ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం నాబార్డ్ భారీ రుణం మంజూరు
Recommended Video
అమరావతి: జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్(నాబార్డ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ సాయాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ నీటి వనరుల అభివృద్ధి సంస్థ(ఏపీడబ్ల్యూఆర్డీసీ)కి నాబార్డ్ రూ. 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది.
చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేయడానికి నాబార్డ్.. ఏపీడబ్ల్యూఆర్డీసీకి ఇన్ఫ్రాక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్(ఎన్ఐడీఏ) కింద మంజూరు చేసిందని నాబార్డ్ ఏపీ ప్రాంతీయ కార్యాలయం సీజీఎం ఎస్ సెల్వరాజ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
చింతలపూడి పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలోని 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాల్లోని 410 గ్రామాలు ఉన్నాయని ఆ ప్రకనటలో వెల్లడించారు. ఈ పథకం ద్వారా 4.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ పంటలకు మూడు దశల్లో 53.50 టీఎంసీల సాగునీటి వసతి కలుగుతుందని వివరించారు.
అంతేగాక, జల్లేరు వద్ద 14 టీఎంసీల సామర్థ్యం గల తాగునీటి రిజర్వాయర్ ద్వారా ప్రాజెక్టు గ్రామాల్లో 26 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మార్చి 22 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సదరు ప్రకటనలు పేర్కొన్నారు.